బీఎల్వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!
- Author : Vamsi Chowdary Korata
Date : 25-12-2025 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూత్ లెవల్ అధికారులు బీఎల్వో, సూపర్వైజర్లకు శుభవార్త అందించింది. వారి వార్షిక పారితోషికాన్ని గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బీఎల్వోలకు రూ.12 వేలు, సూపర్వైజర్లకు రూ.18 వేలు వార్షిక గౌరవ వేతనం లభిస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీరి సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ఏపీలో బీఎల్వోలకు గౌరవం వేతనం పెంపు
- ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి
- BLOకు రూ.12 వేలు, సూపర్వైజర్లకు రూ.18 వేలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో), బీఎల్వో సూపర్వైజర్లకు శుభవార్త చెప్పింది. వారి వార్షిక పారితోషికాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ గౌరవ వేతనం పెంపు 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం బీఎల్వోలకు ఏడాదికి రూ.12 వేలు, బీఎల్వో సూపర్వైజర్లకు ఏడాది రూ.18 వేలు చెల్లిస్తారు. సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్/ఎస్ఆర్) లేదా ఇతర ప్రత్యేక డ్రైవ్లలో పనిచేసే బీఎల్వోలకు అదనంగా రూ.2 వేల ప్రోత్సాహం కూడా లభిస్తుంది.
ఎన్నికల ప్రక్రియలో బీఎల్వోలు చాలా ముఖ్యమైనవారు. ఓటర్ల జాబితాలను సరిచేయడం, కొత్త ఓటర్లను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం వంటి పనులు వారు చేస్తారు. ఈ పనులన్నీ సక్రమంగా జరిగితేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. అందుకే ప్రభుత్వం వారి సేవలను గుర్తించి, పారితోషికాన్ని పెంచింది. పూర్తిగా ఏడాది పాటూ పనిచేసిన బీఎల్వోలకు పూర్తి పారితోషికం అందుతుంది. ఒకవేళ కొద్ది నెలలు మాత్రమే పనిచేసినా, వారు పనిచేసిన కాలానికి తగ్గట్టుగా డబ్బులు చెల్లిస్తారు. బీఎల్వో సూపర్వైజర్లు వారు బీఎల్వోల పనిని పర్యవేక్షిస్తారు.
ఇప్పుడు ఈ పారితోషికం మొత్తాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ మార్పులు చేశారు. ఆర్థిక శాఖ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సీఈవో వివేక్ యాదవ్ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం బీఎల్వోలకు వార్షిక పారితోషికం, సూపర్వైజర్లకు చెల్లించే మొత్తం పెరిగింది. గతంలో బీఎల్వోలకు (బూత్ లెవల్ ఆఫీసర్లు) సంవత్సరానికి రూ.6 వేలు పారితోషికంగా అందేది. అలాగే, సూపర్వైజర్లకు రూ.12 వేలు చెల్లించేవారు. ఎన్నికల సంఘం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో (డ్రైవ్లలో) పనిచేసిన వారికి అదనంగా రూ.1000 ఇచ్చేవారు. ఈ మొత్తాలను ఇప్పుడు పెంచుతూ కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి.. మొత్తానికి బీఎల్వోలకు, సూపర్వైజర్లకు గౌరవం వేతనాన్ని ప్రభుత్వం పెంచడంతో వారు ఆనందంలో ఉన్నారు.