ఏపీకి మరో భారీ పరిశ్రమ
- Author : Vamsi Chowdary Korata
Date : 01-05-2026 - 10:21 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇటవలి కాలంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వచ్చాయి. తాజాగా రాయలసీమకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రూ.10,239 కోట్ల పెట్టుబడితో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లాలో 30 ఎకరాలను కేటాయించారు. ఈ పరిశ్రమకు సంబంధించి తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు క్యూ కట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు మరికొందరు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రాయలసీమ ప్రాంతానికి మరో భారీ సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అత్యాధునిక సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ తయారీ కేంద్రంతో పాటు పవర్ డివైజ్ల కోసం ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ సదుపాయం ప్లాన్ చేసింది. ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇప్పటికే ముంబైలో ఓఎస్ఏటీ సదుపాయాన్ని పైలట్ విధానంలో నిర్వహిస్తోంది. ఈ పరిశ్రమ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ కానుంది.
ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఈ పరిశ్రమకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద అనుమతులు పొందాలని ప్రయత్నిస్తోంది. ఈ పరిశ్రమను రెండు దశల్లో పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చినప్పటి నుంచి 25 నెలల్లో తొలిదశను పూర్తిచేయనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 1,017 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టు తొలి దశ కోసం సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని టేకులోడు దగ్గర 30 ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
మరోవైపు శ్రీసత్యసాయి జిల్లాకు భారీ ఏరోస్పేస్ పరిశ్రమ రాబోతోంది. పుట్టపర్తి సమీపంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కాలంలో శ్రీసత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. అక్కడ డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు రాబోతున్నాయి. ఏరోస్పేస్ రంగంలో రాబోయే రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ఏరోస్పేస్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్న కంపెనీలకు అవసరమైన అనుమతులు, ప్రోత్సాహకాలు, ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నందుకు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ను సీఎం ప్రశంసించారు.