Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావణి
- Author : Prasad
Date : 27-05-2026 - 3:58 IST
Published By : Hashtagu Telugu Desk
మహిళలను కేవలం ఓటు బ్యాంక్గా కాకుండా సమాజానికి శక్తిగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. టీడీపీ మహానాడు–2026 కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతకు పార్టీ ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మహిళల ఉన్నత విద్య కోసం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆడబిడ్డల విద్యకు కొత్త దారులు చూపారని తెలిపారు. అలాగే 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ద్వారా మహిళల స్థాయిని మరింత బలోపేతం చేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్టీఆర్ 9 శాతం రిజర్వేషన్ ఇచ్చారని, ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. గ్రామీణ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా బలపడుతున్నారని, సీఐఎఫ్, స్త్రీనిధి, ఉన్నతి వంటి పథకాల ద్వారా రుణాలు పొంది స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే విజన్-2047 లక్ష్యమని, “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్” కార్యక్రమం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. అలాగే “తల్లికి వందనం” పథకం ద్వారా మహిళలపై విద్యా భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మహిళా శక్తి అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది అని మహానాడు ద్వారా మరోసారి స్పష్టం చేస్తున్నామని బండారు శ్రావణి అన్నారు.