ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు
- Author : Prasad
Date : 26-05-2026 - 9:07 IST
Published By : Hashtagu Telugu Desk
న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు కుటుంబ సభ్యులు, ఇతరుల పేర్లపై కూడా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, కృష్ణలంక, విజయవాడ ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విశాఖపట్నంలోని తగరపువలసలో ఐదు ప్లాట్లు, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మర్రిపాలెంలో మూడు ప్లాట్లు, రుషికొండలోని పెబుల్ బీచ్ టవర్స్లో ఫ్లాట్ కొనుగోలు ఒప్పందం, అలాగే విశాఖపట్నంలో మరో ఫ్లాట్ను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా జెరోధా బ్రోకింగ్ లిమిటెడ్లో సుమారు రూ.45.15 లక్షల పెట్టుబడులు, రెండు వాహనాలను కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న ఏసీబీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.