AP Model Education: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ భేటీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై అధ్యయనం చెయ్యాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యా శాఖ అధికారులకు సూచించారు.
- By Gopichand Published Date - 06:33 PM, Wed - 18 June 25

AP Model Education: ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (AP Model Education) కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి లోకేష్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న సంస్కరణలను కేంద్రమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు 9600 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటుచేసి, వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని, 700 యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. అకడమిక్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్, ఎటువంటి రాజకీయం జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికను ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను విజయవంతంగా పూర్తిచేశామని వెల్లడించారు.
Also Read: AP : 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం
ఆయన ఇంకా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 80 పీఎంశ్రీ స్కూళ్లు, పీఎం జన్ మన్ పథకం కింద 79 హాస్టళ్లు మంజూరుచేశారు. స్టెమ్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ కోసం రూ.186కోట్లు అందించి విద్యారంగ అభివృద్ధికి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మనబడి- మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా పీఎంశ్రీ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 125 ఆటిజం స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములుగా చేసేందుకు జులై 5న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్- టీచర్స్ మీట్ను నిర్వహిస్తున్నాం. విద్యార్థుల పనితీరును వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలను భాగస్వాములను చేస్తున్నాం. విద్యారంగ అభివృద్ధికి సలహాల కోసం ప్రతివారం టీచర్స్ యూనియన్లు, ఉత్తమ ఉపాధ్యాయులతో సమావేశమవుతున్నాం. జూలై 5 న జరిగే మెగా పిటిఏం కార్యక్రమానికి హాజరుకావాలని
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను లోకేష్ ఆహ్వానించారు. ఆగస్ట్ లో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటు కు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం ఇవ్వాలని లోకేష్ కోరగా అందుకు ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై అధ్యయనం చెయ్యాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యా శాఖ అధికారులకు సూచించారు. విద్యా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్న లోకేష్ ను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు.
వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశక్తి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్ (అభ్యసనా ఫలితాలు)కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇందులో భాగంగా ప్రైమరీ స్కూళ్లలో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ) ప్రోగ్రామ్ ను అమలు చేయబోతున్నాం. యాక్టివ్ లెర్నింగ్ లో భాగంగా క్లిక్కర్స్, సమ్మరీ వీడియోలు, ప్రిస్క్రిప్టివ్ హోం వర్క్, పాల్ మోడల్ ను అమలు చేయబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్, ఎసెస్ మెంట్ బుక్ లెట్స్ అందజేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ప్రాజెక్టు అ, ఆ (అక్షర ఆంధ్ర)ను ఏర్పాటుచేశామని వివరించారు.