Srisailam: ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయంగా శ్రీశైలం.. మాస్టర్ ప్లాన్తో కూటమి సర్కార్!
శ్రీశైలం అభివృద్ధికి భూమి లభ్యత ఒక పెద్ద సమస్యగా సీఎం గుర్తించారు. ప్రస్తుతం సరైన పార్కింగ్ సదుపాయాలు లేవని, భూమి అందుబాటులో లేకపోతే భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించలేమని అన్నారు.
- By Gopichand Published Date - 09:35 PM, Sun - 5 October 25

Srisailam: శ్రీశైలంలోని (Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్తో దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న దృష్ట్యా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశంపై సీఎం ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తిరుమల తరహాలో అభివృద్ధి లక్ష్యం
జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలోనే అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. భక్తుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్ర అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని అన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల వంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి, శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని ఆయన ప్రతిపాదించారు.
అటవీ భూమి కేటాయింపు- రోడ్డు అనుసంధానం
శ్రీశైలం అభివృద్ధికి భూమి లభ్యత ఒక పెద్ద సమస్యగా సీఎం గుర్తించారు. ప్రస్తుతం సరైన పార్కింగ్ సదుపాయాలు లేవని, భూమి అందుబాటులో లేకపోతే భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించలేమని అన్నారు. ఈ నేపథ్యంలో దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి అటవీ మంత్రిత్వశాఖకు ఈ అంశాలను వివరించాలని సీఎం సూచించారు. అలాగే ఆయా ఆలయాల పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంరక్షిస్తుందని హామీ ఇచ్చారు.
Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు!
రోడ్డు అనుసంధానంపై దృష్టి
శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. డోర్నాల, సుండిపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాల సమీపంలో ఉన్న జాతీయ రహదారులను దేవాలయానికి అనుసంధానించాలని సీఎం స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణ, పులుల అభయారణ్యం
ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమాన స్థాయిలో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, దీనికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రధానమంత్రి పర్యటన
ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకొనేందుకు రానున్న దృష్ట్యా, ఆయనతో ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించాలని ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా శ్రీశైలం అభివృద్ధి చెందుతున్నందున, ఈ సమగ్ర ప్రణాళిక అత్యంత కీలకం.