Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..
- Author : Vamsi Chowdary Korata
Date : 03-06-2026 - 3:09 IST
Published By : Hashtagu Telugu Desk
రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
డ్యాన్స్ మాస్టర్ పండు ఆరోగ్య పరిస్థితిపై (Dhee Dance master Pandu health update) డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో విశాఖపట్నం జిల్లా ఆనందపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్ (Pandu master Accident) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పండు మాస్టర్ (షణ్ముఖ) ఆరోగ్య పరిస్థితిని వైద్యులు మీడియాకు వివరించారు. ప్రమాదంలో పండు మాస్టర్కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలైనట్లు వెల్లడించారు. పరీక్షలు చేసిన తర్వాత ఎడమ తుంటి కీలు డిస్ లొకేట్ అయ్యిందని, రెండు కాళ్లకు ఆపరేషన్ చేయాల్సి ఉందని వివరించారు. ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. తలకి కూడా స్వల్ప గాయమైనట్లు వెల్లడించారు.
మరోవైపు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం లొడగలవానిపాలెం వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన బాలు రైడర్స్ అనే డాన్స్ గ్రూప్.. మంగళవారం భీమిలి మండలంలో ఒక ఈవెంట్ పూర్తిచేసుకుని రాత్రి సమయంలో తిరిగి వస్తోంది. ఈ క్రమంలోనే లొడగలవానిపాలెం వద్దకు రాగానే కారులోని ఒక మహిళకు వాంతులు అయ్యాయి. దీంతో వాహనాన్ని రోడ్డుపై ఆపి, కారులోని వ్యక్తులు కిందకు దిగారు. ఈ సమయంలోనే కోళ్ల లోడుతో వెళ్తున్న ఒక బొలెరో వాహనం వెనుక నుంచి వచ్చి కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు వెనుక నిలబడిన పండు మాస్టర్, లిఖిత ప్రియ, హారికలకు గాయాలయ్యాయి. పండు మాస్టర్కు రెండు కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో.. వెంటనే మరో కారులో విశాఖలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆనందపురం పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. మరోవైపు ప్రమాదానికి బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యం లేదా నిద్రమత్తు కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖపట్నంలో పండు మాస్టర్ చికిత్స పొందుతున్న మెడికవర్ ఆస్పత్రి వద్దకు చేరుకున్న ఆనందపురం పోలీసులు.. ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు.