ఇంటర్ విద్యార్థులకు రూపాయికే ఆన్లైన్లో పోటీ పరీక్ష
- Author : Vamsi Chowdary Korata
Date : 18-03-2026 - 10:17 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh ఇంటర్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఓ అధ్యాపకుడు అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఆన్లైన్లో తమ ప్రతిభను పరీక్షించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలానికి చెందిన లెక్చరర్ రెళ్లా రెడ్డప్ప ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇందుకోసం ఆయన mpcexams.com పేరుతో ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాయవచ్చు. ల్యాప్టాప్, మొబైల్ లేదా ట్యాబ్ ఉపయోగించి 24/7 ఎక్కడి నుంచైనా ఈ పరీక్షలు రాసుకునే సౌలభ్యం ఉంది. పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలు కూడా తెలుసుకోవచ్చు.
పోటీ పరీక్షలంటే విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మస్థైర్యం నింపడమే తన లక్ష్యమని రెడ్డప్ప చెబుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులు తమ నైపుణ్యాలను తక్కువ ఖర్చుతో అంచనా వేసుకుని, ప్రతిభకు సాన పెట్టుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.