TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్
- Author : Vamsi Chowdary Korata
Date : 13-06-2026 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కర్నూల్లో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు.
కర్నూల్లో నిర్వహించిన జాబ్మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయని, మొత్తం 1,460 ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఒక వ్యక్తికి ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్మేళాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఓర్వకల్లుకు ఎన్నడూ లేనంతగా పరిశ్రమలు వస్తున్నాయని, రిలయన్స్, అగస్త్య సంస్థలను కర్నూలుకు తీసుకువచ్చామని వెల్లడించారు. జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు అమలైతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి అభివృద్ధి సాధిస్తుందని మంత్రి భరత్ విశ్వాసం వ్యక్తం చేశారు.