Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన
- Author : Vamsi Chowdary Korata
Date : 02-04-2026 - 2:01 IST
Published By : Hashtagu Telugu Desk
Talliki Vandanam Scheme ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గతేడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026కు సంబంధించి తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరుతో విద్యార్థుల కోసం పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది. గతేడాది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ‘పేదల సేవలో’ కార్యక్రమాల్లో ఈ కీలక ప్రకటన చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో పాఠశాలలు, జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభమైన వెంటనే ‘తల్లికి వందనం’ నిధుల్ని తల్లుల అకౌంట్లలో జమ చేస్తామన్నారు. జూన్ నెలలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ డబ్బులు అకౌంట్లలో విడుదల చేస్తామన్నారు.
కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ప్రజాప్రతినిధులు, అధికారులు పేదల సేవలోనే ఉంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల కోసం రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆడబిడ్డలకు దీపం 2.0 పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో పైపు ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ అందిస్తామని, వీరికి ఏడాదికి రూ.2400 సబ్సిడీగా ఇస్తామని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ఈ పథకం సూపర్ హిట్ అయిందని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే విద్యార్థికి ఇచ్చే రూ.15 వేలలో, స్కూల్, కాలేజీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.2000 మినహాయించి, మిగిలిన రూ.13వేలు విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థికి తల్లి లేకపోతే, తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాలి, విద్యార్థి తల్లి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి, విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో అనుసంధానించడం (NPCI లింకింగ్) తప్పనిసరి అనే విషయాన్ని మర్చిపోకూడదు. బ్యాంకులో కానీ, నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అకౌంట్ ఆధార్తో లింక్ అయ్యిందో లేదో NPCI అధికారిక వెబ్సైట్ https://www.npci.org.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.