Mudragada Kranthi: ముద్రగడ నివాసం వద్ద హై టెన్షన్.. కూతురిని రానివ్వని భార్య, అభిమానులు
- Author : Vamsi Chowdary Korata
Date : 15-07-2026 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఇవాళ ఉదయం కిర్లంపూడికి ముద్రగడ పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. పద్మనాభానికి నివాళులు అర్పించేందుకు అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముద్రగడకు నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతి రావడంతో కిర్లంపూడిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రాంతి అక్కడికి రాకుండా ముద్రగడ కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు.
క్రాంతిని పద్మనాభం మృతదేహాన్ని తాకేందుకు కూడా ఆయన భార్య అనుమతించలేదు. అసలు రావొద్దంటూ ముద్రగడ తల్లి పెద్దగా కేకలు వేశారు. ఆమెను అక్కడి నుంచి పంపించాలని చెప్పారు. క్రాంతి కూడా తండ్రి మృతదేహాన్ని చివరిసారిగా చూడనివ్వమని కోరినా అనుమతించలేదు. ముద్రగడ కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు సలహా ఇచ్చినా వినకపోవడంతో క్రాంతి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అంతకముందు ప్రత్తిపాడు దగ్గర క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెతో మాట్లాడి కాన్వాయ్గా కాకుండా పరిమితంగా కొంతమంది మాత్రమే వెళ్లాలని సూచించడంతో క్రాంతి కిర్లంపూడికి వచ్చారు. కానీ ముద్రగడ భార్య, కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకోవడంతో, పోలీసులు సూచించినా ఆమె వెనక్కి వెళ్లిపోయారు.
ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె క్రాంతి మధ్య కొంతకాలంగా కుటుంబపరంగా విభేదాలు ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ వైఎస్సార్సీపీలో చేరగా, క్రాంతి జనసేన పార్టీలో చేరవడంతో ఈ విభేదాలు మరింత ముదిరాయి. క్రాంతి, ముద్రగడల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. గతేడాది ముద్రగడ అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన సమయంలో తండ్రి ఆరోగ్యం గురించి క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారని, తాను చూడటానికి కిర్లంపూడి వెళితే తన సోదరుడు గిరితో పాటు మరికొందరు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంపై దగ్గరి బంధువులకు, కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తన తండ్రితో ఎవ్వరినీ మాట్లాడనివ్వడం లేదన్నారు. ఇటీవల తన తండ్రి ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే క్రాంతి తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని చివరి చూపు చూడకుండానే వెళ్లిపోయారు.