Tirumala Srivaru: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా?
ఈవో తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ నెలలో స్వామివారిని సుమారు 20 లక్షల (20,03500) పైచిలుకు భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం దాదాపు రూ. 113 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
- By Gopichand Published Date - 10:56 AM, Sat - 28 December 24

Tirumala Srivaru: రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతికి (Tirumala Srivaru) ప్రత్యేక స్థానం ఉందో మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి మారుమూల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక్కసారైనా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని చూస్తుంటారు. అయితే తిరుమల స్వామి వారిని దర్శించుకోవాలంటే సామాన్య భక్తులకు కనీసం 6 నుంచి 8 గంటల సమయం పడుతుందనే విషయం తెలిసిందే. అయినాసరే స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుని వారు పడిన కష్టాన్ని అంతా మర్చిపోతుంటారు. అయితే స్వామి వారితో పాటు తిరుమల లడ్డూకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తిరుమల వెళ్లినా ఏ భక్తుడైనా సరే తలనీలాలు సమర్పించి వస్తుంటారు. అయితే గత నెలలో అంటే నవంబర్ నెలలో స్వామివారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు తాజాగా తెలిపారు.
ఈవో తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ నెలలో స్వామివారిని సుమారు 20 లక్షల (20,03500) పైచిలుకు భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం దాదాపు రూ. 113 కోట్లు వచ్చినట్లు తెలిపారు. నవంబర్ నెలలో మొత్తం 97 లక్షల లడ్డూల విక్రయాలు జరిగినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. అమ్మ ప్రసాదాన్ని 19,74,000 మంది భక్తులు స్వీకరించారు. తలానీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7,31,000గా పేర్కొన్నారు.
Also Read: AP Mega DSC : డీఎస్సీకి వరుస బ్రేకులు.. నిరుద్యోగుల ఎదురుచూపులు..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి10 నుంచి 20వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్ల విక్రయాలు ఆన్ లైన్లో 1,40,000 జరిగాయి. ఎస్ఎస్డీ టోకెన్లు తిరుపతి, తిరుమలలో 8 కేంద్రాలలో జనవరి 7వ తేది నుంచి ఇవ్వనున్నారు. టోకెన్స్ లేని వారు పది రోజుల పాటు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడవద్దని అధికారులు సూచించారు.
శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. స్వామివారి దర్శనానికి సుమారు 20 గంటలు పడుతున్నట్లు తెలుస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నట్లు సమాచారం. దీంతో టోకేన్ లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే నిన్న (శుక్రవారం) స్వామి వారిని మొత్తం 66,715 భక్తులు దర్శించుకోగా.. 24, 503 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామి వారి ఆదాయం రూ. 4 కోట్లు దాటింది.