హెరిటేజ్కు రాయితీలు.. నిబంధనల ప్రకారమే ప్రోత్సాహకాలు!!
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల గ్రామంలో ఉన్న తన యూనిట్ను విస్తరించేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది.
- Author : Gopichand
Date : 18-03-2026 - 5:45 IST
Published By : Hashtagu Telugu Desk
Heritage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విధానం 4.0’ కింద పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం అందించే సాధారణ ప్రోత్సాహకాలనే హెరిటేజ్ సంస్థకు కూడా మంజూరు చేసింది. దీనిపై జరుగుతున్న రాజకీయ ప్రచారాలకు విరుద్ధంగా, పూర్తి పారదర్శకంగా, పాలసీ నిబంధనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రూ. 209 కోట్ల భారీ పెట్టుబడి.. యువతకు ఉపాధి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల గ్రామంలో ఉన్న తన యూనిట్ను విస్తరించేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం రూ. 209.69 కోట్ల భారీ పెట్టుబడిని ఆ సంస్థ ప్రకటించింది. ఈ విస్తరణ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా చిత్తూరు జిల్లాలో పాడి రైతులకు మరింత మేలు చేకూరనుంది. ఏ పారిశ్రామికవేత్త అయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినప్పుడు, ప్రభుత్వం వారికి నిర్దేశిత రాయితీలు కల్పించడం సహజ ప్రక్రియ.
Also Read: ఏపీ ప్రజలకు ఉగాది కానుకలు.. చంద్రబాబు సర్కార్ వరుస వరాల జల్లు!
రాయితీల లెక్కలివే.. (మొత్తం రూ. 59.69 కోట్లు)
రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) గత నెల 18న సమావేశమై హెరిటేజ్ దరఖాస్తును సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ క్రింది రాయితీలను ఖరారు చేసింది.
టెక్నాలజీ అప్గ్రెడేషన్ సబ్సిడీ: స్థిర మూలధన పెట్టుబడిలో 25 శాతం కింద రూ. 34.93 కోట్లు.
SGST రాయితీ: 100 శాతం ఎస్జీఎస్టీ రాయితీ కింద రూ. 17.80 కోట్లు.
విద్యుత్ చార్జీల రీయింబర్స్మెంట్: యూనిట్కు రూపాయి చొప్పున ఐదేళ్ల కాలానికి రూ. 0.98 కోట్లు.
వడ్డీ రాయితీ: రెండు శాతం చొప్పున రూ. 5 కోట్లు.
ఈ మొత్తం రూ. 59.69 కోట్ల ప్రోత్సాహకాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
రాజకీయ వక్రీకరణలకు తావులేదు
రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద ఏ ఇతర సంస్థకైనా లభించే ప్రయోజనాలనే హెరిటేజ్ కూడా పొందింది. ఇందులో ఎటువంటి ప్రత్యేక మినహాయింపులు గానీ, అదనపు ప్రయోజనాలు గానీ లేవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని, వాస్తవానికి ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్య అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.