CM Chandrababu : ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాజధాని స్థానం విషయంలో స్పష్టతకు మార్గం సుగమమయ్యింది. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో మెగా ఈవెంట్లు నిర్వహించే ప్రతిపాదనకు మంత్రివర్గం అనుమతి తెలిపింది.
- Author : Latha Suma
Date : 08-05-2025 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
CM Chandrababu : ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల జరిగిన 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అమరావతి రాజధాని పరిధిలో వివిధ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు భూమి కేటాయింపుపై కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, “తల్లికి వందనం”, “అన్నదాత సుఖీభవ” వంటి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష చేపట్టి వాటి అమలులో మరింత సమర్ధత కోసం చర్చ జరిగింది. తీరప్రాంత భద్రత, రాష్ట్రంలోని రక్షణ రంగ పరిశ్రమల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించి కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
Read Also: Operation Sindoor Inside : ‘ఆపరేషన్ సిందూర్’ కోసం భారత్ ఇలా ప్లాన్ చేసింది..
“ఆపరేషన్ సిందూర్”ను విజయవంతంగా నిర్వహించిన భారత త్రివిధ దళాలకు మంత్రివర్గం అభినందనలు తెలిపింది. అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాజధాని స్థానం విషయంలో స్పష్టతకు మార్గం సుగమమయ్యింది. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో మెగా ఈవెంట్లు నిర్వహించే ప్రతిపాదనకు మంత్రివర్గం అనుమతి తెలిపింది. దీనివల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావచ్చని అంచనా. అలాగే, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే 281 ప్రాజెక్టులను హైబ్రిడ్ యాన్యూయిటీ విధానంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది మెరుగైన మౌలిక వసతుల కల్పనకు తోడ్పడనుంది. ఇక ,కేంద్ర ప్రభుత్వ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న మూడు ముఖ్యమైన బిల్లులను వెనక్కి తీసుకునే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం రాష్ట్రానికి న్యాయమైన అధికారాలు లభించే దిశగా చక్కటి అడుగుగా భావించబడుతోంది. ఈ సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి.