నేను జగన్ మనిషినా.. దమ్ముంటే చర్చకు సిద్ధం .. ఏబీ వెంకటేశ్వరరావుకు బొలిశెట్టి ఓపెన్ ఛాలెంజ్
- Author : Vamsi Chowdary Korata
Date : 21-01-2026 - 3:24 IST
Published By : Hashtagu Telugu Desk
Bolisetty Satyanarayana VSRetired IPS Officer AB Venkateswara Rao రాజధాని అమరావతి విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. అమరావతిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ బొలిశెట్టి సత్యనారాయణతో కేసులు వేయించారంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం.. దీనికి కారణమైంది. ఈ కేసుల కారణంగానే అమరావతి నిర్మాణంలో జాప్యం జరిగిందని ఏబీవీ అన్నారు. అయితే ఏబీవీ వ్యాఖ్యలపై బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. తప్పుడు కూతలు ఆపాలని.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ ఏబీ వెంకటేశ్వరరావుకు బొలిశెట్టి ఛాలెంజ్ చేశారు.
మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారికి నా బహిరంగ సవాల్.
అబద్ధపు ఆరోపణలు ఇక చాలు – వాస్తవాలు మాట్లాడదాం రండి..
అమరావతి రాజధాని విషయంలో నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం.
అమరావతిలోనే రాజధానిగా ఉండాలని, రైతుల పక్షాన నేను ఎప్పుడూ నిలబడ్డాను. నేను వేసిన కేసులు కేవలం అమరావతి…
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) January 21, 2026
అమరావతి రాజధాని విషయమై రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు.. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది కాస్తా శ్రుతి మించి బహిరంగ సవాళ్లు విసురుకునే వరకూ వెళ్లింది. అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించే క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు .. బొలిశెట్టి సత్యనారాయణ ప్రస్తావన తీసుకువచ్చారు.
” అమరావతికి పర్యావరణ అనుమతులు రాకుండా చాలా పిటిషన్లు వేశారు. అందుకే అమరావతి నిర్మాణంలో ఆలస్యం జరిగింది. పర్యావరణ అనుమతులు రాకుండా కాంట్రాక్టులకు పిలవలేరు. కాంట్రాక్టర్లను పిలవకుండా పనులు జరగవు. సుప్రీంకోర్టు దాకా కేసులు వేయించి అడ్డు తగిలారు. విజయవాడలో ఓ పెద్దాయనతో సుప్రీంకోర్టులో కేసు వేయించారు. బొలిశెట్టి సత్యనారాయణతో కేసులు వేయించారు. ఇలా మూడేళ్లు సాగదీశారు. దీంతో పనులు పూర్తి కాలేదు. పనులు పూర్తి చేయలేదంటూ ప్రజల ముందుకెళ్లారు. ఆ రోజంటే నడిచింది. ఈ రోజు సోషల్ మీడియా ఉంది. మాలాంటోళ్లం ఉన్నాం. నిజాలు చెప్తాం. అబద్ధాలను ఖండిస్తాం” అంటూ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
అయితే ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. అబద్ధాలు ఆపి. బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. అమరావతి రాజధాని విషయంలో ఏబీ వెంకటేశ్వరరావు తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్న బొలిశెట్టి సత్యనారాయణ.. అమరావతిలోనే రాజధాని ఉండాలని, రైతుల పక్షాన తాను నిలబడినట్లు గుర్తుచేశారు. తాను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్, పర్యావరణ రక్షణ కోసం మాత్రమేనని స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో ఏబీ వెంకటేశ్వరరావు కలుగులో దాక్కున్న సమయంలో.. జగన్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా, మడ అడవుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడానన్న బొలిశెట్టి సత్యనారాయణ.. అలాంటి తనను వైఎస్ జగన్ మనిషిని అనడం ఎంతవరకూ సమంజసమన్నారు. సంస్కారం లేకుండా ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పని.. పర్యావరణ పరిరక్షణ. రాజ్యాంగ రక్షణే తన లక్ష్యమన్నారు. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఏబీ వెంకటేశ్వరరావు తప్పుడు కూతలను, కట్టుకథలను పక్కన పెట్టి, తక్షణమే తనపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదా దమ్ముంటే తన వ్యాఖ్యలపై మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని ఏబీ వెంకటేశ్వరరావుకు బొలిశెట్టి సత్యనారాయణ ఛాలెంజ్ చేశారు. ఇందుకు సమయం, వేదికను కూడా మీరే నిర్ణయించడంటూ ట్వీట్ చేశారు.