Sirikit: థాయిలాండ్ మాజీ రాణి సిరికిత్ మృతి!
1970లలో రాజు, రాణి విదేశీ పర్యటనల కంటే దేశీయ సమస్యలపై దృష్టి సారించారు. గ్రామీణ పేదరికం, నల్లమందు వ్యసనం, కమ్యూనిస్ట్ తిరుగుబాటు వంటి సమస్యలను పరిష్కరించడానికి వారు కృషి చేశారు.
- By Gopichand Published Date - 01:56 PM, Sat - 25 October 25
Sirikit: థాయిలాండ్ మాజీ రాణి సిరికిత్ (Sirikit) 93 ఏళ్ల వయసులో బ్యాంకాక్లోని ఒక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు రాయల్ హౌస్హోల్డ్ బ్యూరో ప్రకటించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అక్టోబర్ 17 నుండి రక్త ఇన్ఫెక్షన్తో పోరాడారు. అయితే ఆమె వైద్య బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాచరికంపై ప్రజల్లో అపారమైన గౌరవాన్ని, ప్రభావాన్ని పెంచిన సిరికిత్ మృతి పట్ల దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది.
ఆమె మరణం నేపథ్యంలో థాయిలాండ్ ప్రధానమంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ తన మలేషియా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ వారాంతంలో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాక్షిగా కంబోడియాతో కుదిరే కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసే అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయారు. ఈ ఒప్పంద వేడుకను ఎలా కొనసాగించాలి అనే దానిపై థాయ్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
ప్రజల పక్షపాతి, మాతృ దినోత్సవం
సిరికిత్ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో ప్రజా జీవితానికి దూరంగా ఉన్నప్పటికీ ఆమె థాయ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె భర్త, దివంగత రాజు భూమిబోల్ అదుల్యాదేజ్ అక్టోబర్ 2016లో మరణించారు. సిరికిత్ ఆగస్టు 12న తన పుట్టినరోజును థాయిలాండ్లో మాతృ దినోత్సవంగా జరుపుకునేంతగా ప్రజల గౌరవాన్ని పొందారు. ఆమె రాజకీయ ప్రభావం కూడా గణనీయంగా ఉండేది. రాజకీయ అల్లర్ల సమయంలో ఆమె తెర వెనుక నుండి చూపిన ప్రభావం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పోలీసులతో ఘర్షణలో చనిపోయిన ఒక నిరసనకారుడి అంత్యక్రియలకు ఆమె హాజరవడం, రాజకీయ విభజనలో ఆమె వైఖరికి సంకేతంగా భావించారు.
Also Read: Gleeden Survey : వివాహేతర సంబంధాల్లో బెంగళూరు NO.1 ఎందుకో తెలుసా..?
గ్రామీణ పేదరికంపై పోరాటం
సిరికిత్ కితయాకారా ఆగస్టు 12, 1932న ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. ఫ్రాన్స్లో విద్యనభ్యసిస్తున్నప్పుడు, ఆమె అప్పటి యువ రాజు భూమిబోల్ను కలిశారు. ప్రమాదం తర్వాత రాజు భూమిబోల్ స్విట్జర్లాండ్లో కోలుకుంటున్నప్పుడు వారి మధ్య స్నేహం పెరిగింది. చివరకు 1950లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి నలుగురు పిల్లలు. ప్రస్తుత రాజు మహా వజీరాలొంగ్కోర్న్, ముగ్గురు యువరాణులు.
1970లలో రాజు, రాణి విదేశీ పర్యటనల కంటే దేశీయ సమస్యలపై దృష్టి సారించారు. గ్రామీణ పేదరికం, నల్లమందు వ్యసనం, కమ్యూనిస్ట్ తిరుగుబాటు వంటి సమస్యలను పరిష్కరించడానికి వారు కృషి చేశారు. ఆమె ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వ్యక్తిగతంగా వేలాది మంది ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆమెకున్న ఆసక్తి కారణంగా ఆమెను “గ్రీన్ క్వీన్” అని కూడా పిలిచేవారు. అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లను రక్షించడానికి ఆమె వన్యప్రాణి పెంపకం కేంద్రాలు, హేచరీలను స్థాపించారు. రాణి తల్లి సిరికిత్ మరణం థాయిలాండ్కు ఒక తీరని లోటుగా మిగిలిపోతుంది.