Operation Sindoor : పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ.. క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్ దాడి..!
లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత బలగాలు లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసినట్లు రక్షణశాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
- Author : Latha Suma
Date : 08-05-2025 - 3:54 IST
Published By : Hashtagu Telugu Desk
Operation Sindoor : భారత సైన్యం ప్రతీకార దాడులతో పాకిస్థాన్కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన పాకిస్థాన్కు భారత్ శక్తివంతమైన ప్రత్యుత్తరం ఇచ్చింది. ఈ క్రమంలో పాకిస్థాన్లోని కీలక గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులకు భారత సైన్యం దిగింది. లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత బలగాలు లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసినట్లు రక్షణశాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Read Also: CM Chandrababu : ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
చైనాకు చెందిన హెచ్క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్థాన్, భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, జలంధర్, చండీగఢ్, భుజ్, ఫలోడి వంటి ప్రాంతాల్లోని సైనిక కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిందని సమాచారం. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థలు మరియు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAV గ్రిడ్ వ్యవస్థలు ఈ దాడులను సమర్థంగా అడ్డుకున్నాయి. దాడులకు ఉపయోగించిన డ్రోన్ల శకలాలను ఆయా ప్రాంతాల్లోని భద్రతా బలగాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ఈ చర్యలపై స్పందనగా భారత సైన్యం పాకిస్థాన్లో గగనతల రక్షణ వ్యవస్థలపై ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్థాన్లోని అనేక ప్రాంతాల్లో ఉన్న గగనతల రాడార్ వ్యవస్థలను భారత బలగాలు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాహోర్లోని గగనతల రక్షణ కేంద్రం పూర్తిగా నేలమట్టమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నియంత్రణ రేఖ (LoC) వెంట పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దాడులు ముమ్మరం చేసింది. రాజౌరీ, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో పాకిస్థాన్ బలగాలు మెర్టార్లు, భారీ తుపాకులతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడులలో ఇప్పటివరకు 16 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యం పటిష్టమైన చర్యలు తీసుకుంటూ, మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది.
Read Also: PBKS Vs MI: ధర్మశాల నుంచి అహ్మదాబాద్కు.. పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ స్టేడియం మార్పు!