పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటానికి తెలంగాణ సిద్ధం!
గోదావరి బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటిని తరలించేటప్పుడు ఆ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
- Author : Gopichand
Date : 04-01-2026 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
Polavaram-Nallamala Sagar: పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టులో సోమవారం జరగనున్న విచారణకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ వివాదాస్పద అంతర్రాష్ట్ర నీటి మళ్లింపు పథకాన్ని సవాలు చేస్తూ తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో తమ వాదనలను బలంగా వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా కసరత్తు చేస్తోంది.
ముంబైలో కీలక సమావేశం
ఈ కేసులో అనుసరించాల్సిన న్యాయ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల- పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలను, చట్టపరమైన అభ్యంతరాలను సింఘ్వీకి వివరించారు.
Also Read: హైటెక్ సిటీలో అల్లు అర్జున్ , దంపతులకు చేదు అనుభవం
తెలంగాణ అభ్యంతరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ ఒప్పందాలకు విరుద్ధమని తెలంగాణ మొదటి నుంచీ వాదిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను మళ్లించడం వల్ల తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాకు గండి పడుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్ట్ రూపకల్పనలో నిబంధనలను ఉల్లంఘించారని, దీనివల్ల భవిష్యత్తులో తెలంగాణ సాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.
బలమైన న్యాయ పోరాటం
గోదావరి బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటిని తరలించేటప్పుడు ఆ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ కేసులో సాంకేతిక అంశాలతో పాటు, చట్టపరమైన అంశాలను కూడా సమర్థవంతంగా కోర్టు ముందుంచాలని నిర్ణయించారు. సింఘ్వీ నేతృత్వంలోని న్యాయ బృందం రేపు సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలను వినిపించనుంది.
తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ న్యాయ పోరాటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి న్యాయ నిపుణులతో చర్చలు జరపడం ఈ కేసు ప్రాధాన్యతను చాటిచెబుతోంది.