NTR : అమీర్పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి
- Author : Prasad
Date : 28-05-2026 - 8:18 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అమీర్పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇటు టీడీపీ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరుకానున్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హమీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో ఇచ్చిన హమీని రేవంత్ రెడ్డి నేరవేరుస్తున్నారు.
ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని నిర్వాహకులు పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నివాళి సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విగ్రహావిష్కరణ నేపథ్యంలో అమీర్పేట్ పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఎన్టీఆర్ చిత్రాలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.ళఅలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులు మహానేతను స్మరించుకుంటున్నారు.