HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్జెండర్లకు చోటు
- Author : Prasad
Date : 29-05-2026 - 4:38 IST
Published By : Hashtagu Telugu Desk
సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్ష, నిర్లక్ష్యానికి గురవుతున్న ట్రాన్స్జెండర్ సమాజానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొత్త ఆశాకిరణంగా నిలిచింది. హైడ్రా ఏర్పాటు చేసిన ‘ఈగిల్ టీమ్’లో 16 మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఈ బృందంలో 11 మంది ట్రాన్స్ మహిళలు, 5 మంది ట్రాన్స్ పురుషులు ఉన్నారు. వీరు హైడ్రా సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, పార్కులు తదితర ప్రజా ఆస్తుల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికే ఈగిల్ టీమ్ పలు కీలక కార్యక్రమాల్లో తమ ప్రతిభను చాటుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో 862 ఎకరాల ప్రభుత్వ భూమి పరిరక్షణలో భాగస్వామ్యమైంది. అలాగే మాధాపూర్లోని ఈదులకుంట పరిరక్షణ చర్యల్లో కూడా చురుకుగా పాల్గొంది. ముఖ్యంగా స్థానిక ప్రజలు, మహిళలతో సానుకూలంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించడంలో ఈ బృందం విశేష పాత్ర పోషించింది. హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాన్స్జెండర్ సిబ్బంది సహనం, భావోద్వేగ అవగాహనతో వ్యవహరించడం వల్ల కఠిన పరిస్థితుల్లో కూడా ప్రజలను ఒప్పించడంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. హైడ్రా యూనిఫాం ధరించిన తర్వాత సమాజంలో తమకు గౌరవం పెరిగిందని ఈగిల్ టీమ్ సభ్యురాలు గాయత్రి తెలిపారు. అవకాశం కల్పిస్తే ట్రాన్స్జెండర్లు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఉద్యోగం తమకు సమాజంలో భాగమైన అనుభూతిని కలిగించిందన్నారు. ప్రకృతిని కాపాడే కార్యక్రమంలో భాగస్వాములు కావడం గర్వంగా ఉందని రుచిత తెలిపారు. ఉద్యోగానికి ముందు జీవనోపాధి కోసం భిక్షాటన చేయాల్సి వచ్చేదని, సమాజంలో అవమానాలు ఎదుర్కొనేవారమని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు యూనిఫాం ధరించిన తర్వాత ప్రజలు గౌరవంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈగిల్ టీమ్లోని పలువురు సభ్యులు ప్రస్తుతం తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, సమాజానికి ఉపయోగపడుతున్నామనే ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వెల్లడించారు.