Telangana : తెలంగాణలో రుతుపవనాలు మరింత ఆలస్యం
- Author : Prasad
Date : 26-05-2026 - 9:22 IST
Published By : Hashtagu Telugu Desk
నైరుతి రుతుపవనాలు జూన్ 5 తర్వాతే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాల కదలిక మందగించిందని.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్డి పేర్కొంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ.. ఎల్ నినో ప్రభావం కారణంగా అవి జూన్ 5 నుంచి 10 మధ్య రాష్ట్రంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో తీవ్రమైన వేడి కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలంలో సోమవారం పగటి ఉష్ణోగ్రత 46.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పదమూడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్గా.. మరో ఆరు జిల్లాల్లో 45.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.