IPS Officers : కోయంబత్తూరు బాలిక కేసు దర్యాప్తులో ఐపీఎస్ అధికారుల వింత ప్రవర్తన.. ముగ్గురు సస్పెండ్
- Author : Prasad
Date : 26-05-2026 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
కోయంబత్తూరు బాలికపై దాడి కేసులో మీడియా సమావేశం సందర్భంగా ఐపీఎస్ అధికారుల ప్రవర్తన తీరు వివాదస్పదమైంది. ఈ వివాదంలో విమర్శలు ఎదుర్కొన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కోయంబత్తూరు జిల్లాలో 10 ఏళ్ల బాలికను అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదైన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించి, వేగంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
అయితే కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు ముగ్గురు ఉన్నతాధికారులు నవ్వుతూ, సరదాగా మాట్లాడుకుంటున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంతటి సున్నితమైన కేసులో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సున్నితమైన కేసుల విచారణలో పోలీసు అధికారులు వృత్తి నైపుణ్యం, బాధ్యతతో వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కోయంబత్తూరు కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులపై తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.