Medigadda Barrage : కేంద్రం వార్నింగ్.. ‘మేడిగడ్డ’పై రేపటిలోగా వివరాలివ్వకుంటే చర్యలు
Medigadda Barrage : కేంద్రం వార్నింగ్.. ‘మేడిగడ్డ’పై రేపటిలోగా వివరాలు ఇవ్వకుంటే చర్యలు
- Author : Pasha
Date : 28-10-2023 - 1:08 IST
Published By : Hashtagu Telugu Desk
Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోని 20వ పిల్లర్ కుంగిన ఘటనపై రాష్ట్ర సర్కారుకు కేంద్రం కీలకమైన ఆర్డర్స్ ఇష్యూ చేసింది. బ్యారేజీకి సంబంధించి తాము కోరిన సమాచారాన్ని ఒకరోజు(ఆదివారం)లోగా ఇవ్వాలని జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ నిర్దేశించింది. అక్టోబరు 23 నుంచి 26 వరకు మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని ఆరుగురు కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ సందర్శించింది. ఆ సమయంలో కేంద్రం నిపుణుల టీమ్కు రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీతో ముడిపడిన మూడు అంశాలపైనే సమాచారాన్ని ఇచ్చింది. దీంతో మిగతా 17 అంశాలపై సమాచారాన్ని ఇవ్వాలంటూ తాజాగా కేంద్రం లేఖను పంపింది. ఒకవేళ ఆదివారంలోగా సమాచారం ఇవ్వకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లు లేనట్లుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలుంటాయని జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ వార్నింగ్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోని 20వ పిల్లర్ కుంగుబాటు నేపథ్యంలో దానికి సమీపంలోని దాదాపు ఐదు పిల్లర్స్ కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయని తెలంగాణ నీటిపారుదల శాఖ అంచనా వేసింది.దీనిపై రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం అధికారులతో సమీక్షించారు. బ్యారేజీ ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణం, నీటిని తోడిపోయడం, పునాది వరకూ పరిశీలన, బ్యారేజీలో ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్ పరిస్థితిపై అధ్యయనం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతరం నిపుణులను సంప్రదించి నిర్మాణ సంస్థతో పునరుద్ధరణ పనులు చేయించనున్నట్లు సమాచారం. కాగా, మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఓ అడుగుమేర కుంగిన విషయం ఈ నెల 21న వెలుగుచూసిన సంగతి(Medigadda Barrage) తెలిసిందే.