Kalvakuntla Kavitha: టీఆర్ఎస్ పేరుపై కవిత కన్ను.
- Author : Vamsi Chowdary Korata
Date : 03-04-2026 - 3:23 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Rashtra Samithi తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదని, ఆ పేరును ఎవరైనా ఉపయోగించుకోవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత త్వరలో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి పేరు మీదనే పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించారు. ఆ తర్వాత మరిన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా, ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు (టీఆర్ఎస్) ఇప్పుడు ఎవరి సొంతం కాదని గుర్తు చేశారు. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరని అన్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు. పాతిక సంవత్సరాల క్రితం కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మారిన విషయం తెలిసిందే.
ప్రైవేటు పాఠశాలల ఫీజులపై విమర్శలు.
రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచడం మధ్య తరగతి తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.
తక్షణమే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజుల వసూళ్లను కట్టడి చేయాలని కోరారు. ప్రైవేటు స్కూళ్లపై ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు 8 శాతం నుంచి 10 శాతం పెంచుకోవచ్చని, కానీ 30 నుంచి 35 శాతం పెంచితే ఎలాగని ప్రశ్నించారు.