Manukota : బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు అనుమతి
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కొడంగల్ , లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి కేటీఆర్ నేతత్వంలో మహాధర్నా నిర్వహించ తలపెట్టారు.
- By Latha Suma Published Date - 05:01 PM, Thu - 21 November 24

BRS Maha Dharna: తెలంగాణ హైకోర్టు మానుకోట బీఆర్ఎస్ మహా ధర్నాకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మహా ధర్నా కార్యక్రమం చేసుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది. వెయ్యి మందితో ధర్నా చేపట్టొచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ మాత్రం 50 వేల మందితో మహా ధర్నా చేపడతామని మొదట ప్రకటించింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో.. తక్కువ మందితోనే ధర్నా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.
కాగా, వికారాబాద్ లగచర్ల ఘటన గిరిజనులకు మద్దతుగా కేటీఆర్ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కొడంగల్ , లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి కేటీఆర్ నేతత్వంలో మహాధర్నా నిర్వహించ తలపెట్టారు. ఈ ధర్నాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతలు. వాదనలు విన్న ధర్మాసనం.. బీఆర్ఎస్ మహా ధర్నాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన.. ఇదేం పాలన అంటూ ముఖ్యమంత్రి రేవంత్పై తీవ్ర విరమ్శలు గుప్పించారు.
Read Also: World Television Day 2024: తిరుగులేని ‘ఠీవీ’.. విజువల్ మీడియాలో రారాజు