New Pensions: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త పెన్షన్లు.. ఎప్పటి నుంచంటే..?
- Author : Vamsi Chowdary Korata
Date : 18-05-2026 - 11:03 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త పింఛన్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. నిరుద్యోగుల కోసం మిర్యాలగూడ, నకిరేకల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు జర్మనీలో 5 లక్షల ఉద్యోగాల సాధన కోసం టామ్కామ్ ద్వారా రూ.90 కోట్లతో జర్మన్ భాషా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.
తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక తీపి కబురు. జూన్ 2 నుంచి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల కొత్త పింఛన్ల మంజూరుకు పూర్తి స్థాయిలో ఆమోదముద్ర వేసిందని ఆయన వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా ప్రజలను వంచించిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిరుద్యోగులకు ఆధునిక టెక్నాలజీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో త్వరలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ATC) పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, టామ్కామ్ సంస్థ ద్వారా యువతకు విదేశీ భాషలు నేర్పించి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జర్మనీలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, మన యువతకు జర్మన్ భాష నేర్పించేందుకు ప్రత్యేకంగా ఫ్యాకల్టీని నియమిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.90 కోట్లు కేటాయించారని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలన్నింటికీ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని, గతంలో లాగా కాకుండా సకాలంలో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు నేరుగా జమ అవుతున్నాయని స్పష్టం చేశారు. పరిశ్రమలలో కార్మికుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఫ్యాక్టరీలలో రక్షణ ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఫార్మా రంగంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నివారణకు, కార్మికుల ప్రాణ రక్షణకు త్వరలోనే అత్యంత కఠినమైన నూతన విధివిధానాలను తీసుకురానున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.