Revanth Warning : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR - Special Intensive Revision) గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
- Author : Latha Suma
Date : 19-07-2026 - 2:48 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR – Special Intensive Revision) గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి నిర్వహించిన అత్యవసర జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు ఈ ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను అస్సలు సీరియస్గా తీసుకోవడం లేదని, చాలా మంది నాయకులు తమ క్షేత్రస్థాయి బాధ్యతలను వదిలేసి హైదరాబాద్లోని ఏసీ గదుల్లోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. కేవలం పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసమే గాంధీభవన్ చుట్టూ తిరిగే సంస్కృతిని ఇకనైనా వీడాలని, ఆగస్టు 3వ తేదీ వరకు ఏ ఒక్క నేత కూడా గాంధీభవన్ మెట్లు ఎక్కడానికి వీల్లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు.
రాబోయే 10 రోజులు ఎన్నికల ప్రచారంలా సాగాలి.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు!
ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ అనేది 2028 అసెంబ్లీ ఎన్నికలకు పునాది వంటిదని, ఇందులో జరిగే చిన్న పొరపాటైనా పార్టీకి భారీ నష్టం కలిగిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకే రాబోయే 10 రోజుల పాటు ప్రతి లీడర్ తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. కేవలం ప్రభుత్వ బూత్ స్థాయి అధికారుల (BLO) నివేదికలపైనే ఆధారపడకుండా, పార్టీ నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లను (BLA) చురుగ్గా వాడుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థంగా పని చేయని ఎంపీలు, ఇన్ఛార్జులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని, అవసరమైతే బాధ్యతల నుంచి తప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాగే, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే 100 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను (BLAs) స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిపించి, ఫోటో దిగే సువర్ణావకాశాన్ని కల్పిస్తామని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.