TSPSC Chairman: టీఎస్పీఎస్పీ ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ ఆమోదం
టీఎస్పీఎస్పీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి
- By Praveen Aluthuru Published Date - 02:22 PM, Thu - 25 January 24

TSPSC Chairman: టీఎస్పీఎస్పీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి ఈ పదవిలో ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆయన రాజీనామా చేశారు. దీంతో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్పీ నూతన ఛైర్మన్ గా కొనసాగుతారు.
టీఎస్పీఎస్పీ నియామకానికి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో ఛైర్మన్ పదవితో పాటు ఇతర 50 మంది సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి , సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల దరఖాస్తులను పరిశీలించారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకు ఫైల్ పంపారు. ఈ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో టీఎస్ పీఎస్సీ నూతన ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైంది.
టీఎస్పీఎస్పీ నియామకం విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు తెలంగాణ గవర్నర్ తమిళిసై తో భేటీ అయ్యారు. రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని గవర్నర్ ను ఆహ్వానించారు. ఈ కీలక అంశాలపై చర్చించారు.నిన్న భేటీ జరిగిన తర్వాత ఈ రోజు మహేందర్ రెడ్డి నియామాకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్పీ పరీక్షల నిర్వహణలో పలు విమర్శలు ఎదుర్కొంది. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో గత ప్రభుత్వంలో నియమించిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు రాజీనామా చేసారు. ఒకరకంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి టీఎస్పీఎస్పీ లో జరిగిన అవకతవకలు కూడా ఒక కారణమయ్యాయి.