Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
సర్వే వివరాలను స్వతంత్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారని ముఖ్యమంత్రి తెలిపారు.
- By Gopichand Published Date - 07:45 PM, Wed - 23 July 25

Sarpanch Elections: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు (Sarpanch Elections) నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు సైతం 90 రోజుల్లో (సెప్టెంబరు నెలాఖరులోగా) స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో (జులై నెలాఖరులోగా) రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించిందన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రెండు బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలను గురువారం ఉదయం కలిసి తెలంగాణ ప్రభత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే (SEEEPC) జరిపిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలను వివరిస్తామని తెలిపారు. సాయంత్రం కాంగ్రెస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఈ అంశాన్ని వివరిస్తామని సీఎం వెల్లడించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ ప్రభుత్వం చేసిన రెండు బిల్లుల ఆమోదానికి పట్టుపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం మద్దతు పలికాయని సీఎం గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ ముస్లింలను సాకుగా చూపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Also Read: Shubman Gill: భారత్ చెత్త రికార్డును మార్చలేకపోతున్న శుభమన్ గిల్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించాలని సీఎం సవాల్ విసిరారు. గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని… ఇక ముందు అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ నేతలు అందుకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని సీఎం ప్రశ్నించారు.
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ, కుల సర్వే ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న మొదలు పెట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పూర్తి చేసి శాసనసభలోనూ ఆమోదించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే తెలంగాణలో ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా (సోషల్ జస్టిస్ డే) జరుపుతున్నామని తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణలో 3.55 కోట్ల మంది వివరాలు సేకరించామని సీఎం పేర్కొన్నారు. సర్వే వివరాలను శాసనసభ ముందుంచామని… దాని ప్రకారం 56.4 శాతం బీసీలు, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శాతం ఎస్టీలు, 10.09 శాతం ఉన్నత వర్గాల వారు ఉన్నారని సీఎం చెప్పారు. తెలంగాణలో 3.09 శాతం మంది తాము ఏ కులానికి చెందమని ప్రకటించారని.. తెలంగాణలో ఇదో కొత్త పరిణామమని అన్నారు.
సర్వే వివరాలను స్వతంత్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ నివేదికను మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో ప్రవేశపెడతామని వెల్లడించారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్గా నిలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు బిల్లుల రద్దు విషయంలోనూ తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రద్దు చేయించామని… కుల గణన విషయంలో తమ మార్గంలో నడిచేలా చేశామని సీఎం తెలిపారు.