Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..
- Author : Vamsi Chowdary Korata
Date : 02-05-2026 - 11:59 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రియుడు మొబైల్ ఫోన్కు రీచార్జ్ చేయించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్లో కిరణ్మయి అనే యువతి నివాసం ఉంటోంది. గతంలో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉండగా, అతను కిరణ్మయి తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆమెకు వెంకటేశ్ అలియాస్ చందూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఏడాది కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం కిరణ్మయి ఫోన్ రీచార్జ్ గడువు ముగిసింది. జీతం ఇంకా రాకపోవడంతో తన ప్రియుడు వెంకటేశ్ను రీచార్జ్ చేయించమని కోరింది. అందుకు అతను నిరాకరించడంతో శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్మయి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు విడిచింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చిన్న గొడవకే యువతి ప్రాణాలు తీసుకోవడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.