తెలంగాణలో మరో ESIC హాస్పిటల్.. గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం
- Author : Vamsi Chowdary Korata
Date : 16-12-2025 - 4:21 IST
Published By : Hashtagu Telugu Desk
Esic Hospital : తెలంగాణలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. శంషాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక కార్మికుల కోసం 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద రూ. 16.12 కోట్ల విలువైన భూసేకరణకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జిల్లాలోని 1.32 లక్షల మంది బీమా కలిగిన కార్మికులకు తమ నివాసాలకు సమీపంలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం, నిర్వహణను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలోని శ్రామిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటైన శంషాబాద్ పరిసరాల్లో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో జరిగిన ఈఎస్ఐసీ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. రంగారెడ్డి జిల్లా.. శంషాబాద్ మండలం పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామ శివారున ఉన్న రైకుంట వద్ద ఈ ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ప్రాథమికంగా రూ. 16.125 కోట్ల విలువైన భూసేకరణ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు 1.32 లక్షల మంది ఈఎస్ఐ బీమా కలిగిన కార్మికులు ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం దాని చుట్టుపక్కల వస్తున్న కొత్త పరిశ్రమల వల్ల భవిష్యత్తులో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
ఈ నూతన ఆసుపత్రి నిర్మాణ బాధ్యతలను, నిర్వహణను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ఇప్పటికే హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్మికులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తోంది. అదే తరహాలో శంషాబాద్ ఆసుపత్రిలో కూడా కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పించనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నాచారం, రామచంద్రాపురం, సిర్పూర్ కాగజ్నగర్, వరంగల్ వంటి ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. ఇప్పుడు శంషాబాద్లో ఆసుపత్రి రావడం వల్ల విమానాశ్రయ జోన్లోని కార్మికులకు దూరభారం తగ్గుతుంది.
అత్యవసర సమయాల్లో కార్మికులు నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా.. వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉచిత చికిత్స పొందే వీలుంటుంది. తెలంగాణ కార్మికుల చిరకాల వాంఛను నెరవేర్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మంత్రి మన్సుఖ్ మాండవియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని పారిశ్రామికాభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి ఏర్పాటు ద్వారా శ్రామిక కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభించడమే కాకుండా.. స్థానికంగా వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.