పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య
- Author : Vamsi Chowdary Korata
Date : 18-04-2026 - 12:14 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో రాజేశ్వరి అనే వివాహిత అదృశ్యమైంది. ఆమెను భర్త శివకుమార్ ‘పెరుగు తింటే లావు అవుతావు’ అని అన్నందుకు మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త సరదాగా అన్న మాటలను రాజేశ్వరి సీరియస్గా తీసుకుని ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైంది. దీంతో ఆమె కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్బీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు.
దంపతుల మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురాలు ఉండవని అంటుంటారు. సాధారణంగా దంపతుల మధ్య గొడవలు ఆర్థిక ఇబ్బందుల వల్లో, ఇతర కుటుంబ సమస్యల వల్లో వస్తుంటాయి. కానీ, హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ పరిధిలోని శంషిగూడలో పెరుగు విషయంలో వచ్చిన చిన్న మాట పట్టింపు ఓ వివాహిత అదృశ్యానికి దారితీసింది. భర్త చేసిన సరదా వ్యాఖ్యను తీవ్రంగా పరిగణించిన భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.
శంషిగూడకు చెందిన శివ కుమార్, రాజేశ్వరి దంపతులు. భార్య రాజేశ్వరి కాస్త సన్నగా ఉండటంతో భర్త శివ కుమార్ ఆమె ఆరోగ్యంపై శ్రద్ధతో ‘నువ్వు చాలా సన్నగా ఉన్నావు, కొంచెం పెరుగు తినడం అలవాటు చేసుకో.. అప్పుడైనా ఒళ్లు వస్తుంది’ అని అన్నాడు. భర్త మంచి కోరి చెప్పినప్పటికీ రాజేశ్వరి ఆ మాటను మనసులో పెట్టుకుంది. అది తనను అవమానించినట్లుగా భావించి తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త అన్న మాటతో అలిగిన రాజేశ్వరి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయింది. రాత్రి కావొస్తున్నా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన శివకుమార్ స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికాడు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో చివరకు కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ ఆమె ఎటు వెళ్లిందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.