టీ20 ప్రపంచ కప్ 2026.. బంగ్లాదేశ్ అవుట్, స్కాట్లాండ్ ఇన్!
నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును బంగ్లాదేశ్ పట్టించుకోలేదు. ఒక సభ్య దేశం కోసం షెడ్యూల్ మారిస్తే, భవిష్యత్తులో అది చెడు సంప్రదాయానికి దారితీస్తుందని ఐసీసీ భావించింది.
- Author : Gopichand
Date : 25-01-2026 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. కొన్ని వారాలుగా సాగిన ఉత్కంఠకు తెరదించుతూ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నమెంట్లో చేరుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ప్రకటించింది.
వివాదానికి కారణం ఏంటి?
భారత్- బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ససేమిరా అంది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని పట్టుబట్టింది. అయితే భారత్లో భద్రతాపరమైన ముప్పు ఏమీ లేదని ఐసీసీ భద్రతా నివేదికలు తేల్చిచెప్పాయి. వేదికల మార్పు అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినప్పటికీ బీసీబీ తన మొండి వైఖరిని వీడలేదు.
Also Read: భారత్ ఘనవిజయం.. 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా!
చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?
నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును బంగ్లాదేశ్ పట్టించుకోలేదు. ఒక సభ్య దేశం కోసం షెడ్యూల్ మారిస్తే, భవిష్యత్తులో అది చెడు సంప్రదాయానికి దారితీస్తుందని ఐసీసీ భావించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రపంచ కప్ ఆడటానికి ఆసక్తి చూపినప్పటికీ బోర్డు రాజకీయ కారణాలతో వెనక్కి తగ్గలేదు. మంచి అవకాశం దక్కించుకున్న స్కాట్లాండ్ బంగ్లాదేశ్ నిష్క్రమణతో స్కాట్లాండ్కు అదృష్టం వరించింది. మెగా టోర్నీలో ఆడేందుకు ఆ జట్టు సర్వసిద్ధమైంది. “ఇది కఠినమైన నిర్ణయం అయినప్పటికీ టోర్నమెంట్ గౌరవాన్ని కాపాడటానికి షెడ్యూల్ మార్చకూడదని నిర్ణయించాం” అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ లాంటి బలమైన జట్టు లేకపోవడం ఆ దేశ అభిమానులకు నిరాశ కలిగించినా, కొత్త జట్టుగా స్కాట్లాండ్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.