రేపే న్యూజిలాండ్తో మూడో వన్డే.. టీమిండియా గెలవగలదా?!
ఇండోర్లోని హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలు కలిగి ఉండటం, బౌలర్లకు పిచ్ నుండి తక్కువ సహకారం లభిస్తుండటంతో పొరపాట్లకు అస్సలు అవకాశం ఉండదు.
- Author : Gopichand
Date : 17-01-2026 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs NZ: భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. వడోదరలో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం సాధించగా రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో కివీస్ జట్టు పైచేయి సాధించింది. ఇప్పుడు రెండు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్ ఆదివారం, జనవరి 18న ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది.
ఇప్పటివరకు సొంతగడ్డపై వన్డేల్లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్న భారత జట్టు న్యూజిలాండ్పై సిరీస్ గెలవాలంటే ఆదివారం జరిగే తుది వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే మూడు విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా ఈ సిరీస్ను గెలిచి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది.
మార్చి 2019 నుండి టీమ్ ఇండియా తన సొంత మైదానంలో ఎటువంటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ను కోల్పోలేదు. అప్పట్లో ఆస్ట్రేలియాపై 0-2తో వెనుకబడిన తర్వాత భారత జట్టు అద్భుతంగా పుంజుకుని 3-2తో సిరీస్ను గెలుచుకుంది. అయితే ఇప్పుడు భారత్ ఈ రికార్డు ప్రమాదంలో పడింది. న్యూజిలాండ్కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. కివీస్ జట్టు 1989 నుండి ద్వైపాక్షిక వన్డే మ్యాచ్ల కోసం భారత్లో పర్యటిస్తున్నప్పటికీ ఇక్కడ ఇప్పటివరకు ఒక్క వన్డే సిరీస్ను కూడా గెలవలేకపోయింది.
Also Read: ఉజ్జయినిలోని బాబా మహాకాల్ను దర్శించుకున్న టీమిండియా ప్లేయర్స్!
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన నాయకత్వంలో సొంతగడ్డపై జట్టు మరో సిరీస్ను కోల్పోకూడదని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే కొన్ని అవాంఛనీయ రికార్డులు నమోదయ్యాయి. గంభీర్ హయాంలో భారత్ సొంతగడ్డపై ఐదు టెస్టు మ్యాచ్లు ఓడిపోయింది. తొలిసారిగా శ్రీలంకలో వన్డే సిరీస్ను కోల్పోయింది.
రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమికి కారణం కేవలం ఒక అసాధారణ ఇన్నింగ్స్ మాత్రమే కాదు. మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ బౌలర్లు మ్యాచ్పై అద్భుతమైన నియంత్రణ సాధించడమే. డారిల్ మిచెల్ చేసిన అజేయ సెంచరీ పక్కా ప్రణాళికతో కూడిన దూకుడుకు నిదర్శనం. ఆయన ముఖ్యంగా భారత స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో స్పిన్ విభాగంలో భారత్ తడబడుతున్న విషయం స్పష్టమవుతోంది.
ఇండోర్లోని హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలు కలిగి ఉండటం, బౌలర్లకు పిచ్ నుండి తక్కువ సహకారం లభిస్తుండటంతో పొరపాట్లకు అస్సలు అవకాశం ఉండదు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్ల సామర్థ్యంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జట్టు బ్యాటింగ్ లోతుగా ఉన్నప్పటికీ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల ముందు బ్యాటర్లు అసౌకర్యంగా కనిపిస్తున్నారు. కీలక సమయాల్లో బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నారు. ఈ భారీ స్కోర్ల మైదానంలో మిడిల్ ఓవర్లే మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది.