Mohammed Shami: భారత్ కు బిగ్ షాక్… ఇంగ్లాండ్ తో తొలి 2 టెస్టులకు షమీ దూరం
సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న భారత్ సొంతగడ్డపై ఆప్ఘనిస్థాన్ తో టీ ట్వంటీ సిరీస్ కు సిద్ధమవుతోంది. ఇది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఈ సిరీస్ కూడా కీలకం కానుంది.
- By Praveen Aluthuru Published Date - 12:25 AM, Tue - 9 January 24
Mohammed Shami: సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న భారత్ సొంతగడ్డపై ఆప్ఘనిస్థాన్ తో టీ ట్వంటీ సిరీస్ కు సిద్ధమవుతోంది. ఇది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఈ సిరీస్ కూడా కీలకం కానుంది. సొంతగడ్డ కావడంతో భారత్ జట్టునే ఫేవరెట్ గా చెప్పొచ్చు. అయితే ఈ సిరీస్ కు ముందే ఆటగాళ్ల గాయాలు భారత్ ను వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయంతో వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన షమీ సౌతాఫ్రికా పర్యటనకు కూడా వెళ్లలేదు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కైనా అతను అందుబాటులో ఉంటాడని భావించినప్పటకీ… చీలమండ గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో జరిగే తొలి రెండు టెస్ట్లకు అతను దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం షమి ఎన్ సిఎలో చికిత్స పొందుతున్నాడు. షమీ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదని, అతను ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉందని ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. గాయంతోనే వన్డే ప్రపంచకప్ ఆడిన టోర్నీలోనే హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ సాయంతో మ్యాచ్ లు ఆడినట్టు ఇటీవలే తెలిసింది. ఇటీవల సౌతాఫ్రికా టూర్ లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అక్కడి పేస్ పిచ్ లపై షమీ లేని లోటును ఎవ్వరూ భర్తీ చేయలేకపోవడంతో సిరీస్ గెలిచే అవకాశం చేజారిపోయింది. కాగా షమీ విషయంలో బీసీసీఐ తొందరపడడం లేదని సమాచారం. పూర్తిగా కోలుకున్న తర్వాతే అతన్ని ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ల సిరీస్ జనవరి 25 నుంచి మొదలుకానుంది.
Also Read: Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్