India vs England: లార్డ్స్ టెస్ట్లో పోరాడి ఓడిన భారత్.. 22 పరుగులతో ఇంగ్లాండ్ విజయం!
లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లండ్ భారత్ను 22 పరుగుల తేడాతో ఓడించింది. టీమ్ ఇండియాకు 193 పరుగుల లక్ష్యం లభించింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.
- By Gopichand Published Date - 10:16 PM, Mon - 14 July 25

India vs England: లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లండ్ భారత్ను (India vs England) 22 పరుగుల తేడాతో ఓడించింది. టీమ్ ఇండియాకు 193 పరుగుల లక్ష్యం లభించింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2018 తర్వాత ఇంగ్లండ్ లార్డ్స్లో టీమ్ ఇండియాను ఓడించిన మొదటి సందర్భం ఇదే కావడం విశేషం. భారత్ తరఫున రవీంద్ర జడేజా చాలా సేపు భారత్ విజయ ఆశలను సజీవంగా ఉంచాడు. కానీ అతని 61 పరుగుల ఇన్నింగ్స్ భారత్ను 22 పరుగుల ఓటమి నుంచి కాపాడలేకపోయింది.
భారత్- ఇంగ్లండ్ రెండు జట్లూ తమ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 192 పరుగుల స్కోరును చేసింది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా అనిపించినా లార్డ్స్ మైదాన చరిత్ర సాక్షిగా చెప్పినట్లు ఇక్కడ ఛేజింగ్ చేయడం అత్యంత కష్టమని మరోసారి టీమిండియా రుజువు చేసింది.
భారత్కు 193 పరుగుల లక్ష్యం లభించింది
193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత జట్టులో యశస్వీ జైస్వాల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. నంబర్-3 సమస్య టీమ్ ఇండియాకు కొనసాగుతోంది. ఎందుకంటే కరుణ్ నాయర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉన్నప్పటికీ కీలక సమయంలో కేవలం 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్ లార్డ్స్ టెస్ట్లో రాణించలేకపోయింది. అతను మొదటి ఇన్నింగ్స్లో 16, రెండో ఇన్నింగ్స్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2-1తో ముందంజలో ఉంది.
Also Read: Cavities : కావిటీస్..శరీరంలో ఏ లోపం వలన పుచ్చి పళ్ల సమస్య వస్తుందో తెలుసా?
193 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు భారత్ ఒక దశలో 82 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో విజయం కోసం భారత్కు మరో 111 పరుగులు అవసరం ఉంది. ఈ సమయంలో నీతీష్ కుమార్ రెడ్డి 13 విలువైన పరుగులు సాధించి.. జడేజాతో కలిసి 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఎనిమిదో వికెట్ పడిపోయే వరకు భారత్కు 81 పరుగులు అవసరం ఉండగా.. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ జడేజాకు చాలా సేపు తోడుగా నిలిచారు. ఒకవైపు బుమ్రా పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు. మరోవైపు సిరాజ్ డిఫెన్స్ ఆడగా.. బంతి అతని బ్యాట్ను తాకి స్టంప్స్కు తగిలింది. దీంతో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.