YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి షర్మిల విడుదల
- Author : Praveen Aluthuru
Date : 25-04-2023 - 5:36 IST
Published By : Hashtagu Telugu Desk
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నిన్న సోమవారం ఆమె అరెస్ట్ అయి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఆమె తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు కోర్టు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులపై చేయి చేసుకోవడం, ఎస్సై స్థాయి అధికారితో దురుసుగా ప్రవర్తించడంపై వైఎస్ షర్మిలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలంగాణాలో పేపర్ లీకేజి వ్యవహారంలో షర్మిల అధికార పార్టీపై పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ధర్నాలు, నిరసనలకు నాయకత్వం వహించింది ఆమె. అయితే సోమవారం పేపర్ లీకేజి వ్యవహారంపై ఈడీకి స్వయంగా లేఖ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసహనానికి గురైన షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారు మహిళ కానిస్టేబుల్ చెంప మీద కొట్టారు. ఇదే క్రమంలో ఓ ఎస్సై స్థాయి అధికారితో దురుసుగా ప్రవర్తించారు. కారుతో కానిస్టేబుల్ కాలిపై ఎక్కించారు. నిన్న సోమవారం లోటస్ ఫండ్ వద్ద పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. కాగా షర్మిలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షల అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు.
షర్మిల తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇద్దరు పూచీకత్తుతో పాటు, 30 వేల జరిమానాతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీంతో కోర్టు బెయిల్ పత్రాలను చంచల్ గూడ జైలు అధికారులకు సమర్పించారు. కొద్దిసేపటి క్రితమే ఆమె చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు షర్మిల విదేశాలకు వెళ్ళడానికి అనుమతి అవసరమని ఆదేశించింది.
Read More: Anasuya Bharadwaj : అసలైన అందానికి కేరాఫ్ గా అనసూయ