Delhi Exit Poll Results 2025 : మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కమలానికే
Delhi Exit Poll Results 2025 : మెజారిటీ సర్వేలు కమలదళానికి అధికారం దక్కుతుందని సూచిస్తున్నాయి
- By Sudheer Published Date - 08:34 PM, Wed - 5 February 25

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Elections ) ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ (Delhi Exit Poll Results) బీజేపీ(BJP)కి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నాయి. మెజారిటీ సర్వేలు కమలదళానికి అధికారం దక్కుతుందని సూచిస్తున్నాయి. గతంలో కూడా అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం బీజేపీ గెలుస్తుందనే విశ్లేషణ ఎక్కువగా కనిపిస్తోంది.
వివిధ సర్వేల అంచనాలు చూస్తే…
చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం.. బీజేపీ 39-44 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా. అలాగే పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరి 42-50, జేవీసీ పోల్ 39-45 సీట్లు బీజేపీకి వస్తాయని పేర్కొన్నాయి. అయితే కేకే సర్వే మాత్రం భిన్నంగా స్పందించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 39 స్థానాలు గెలవనుందని, బీజేపీ 22 స్థానాలతో వెనుకబడుతుందని తాము అంచనా వేస్తున్నామని పేర్కొంది.
ఇక ఎగ్జిట్ పోల్స్ తాము నమ్మబోమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు అనేక సేవలు అందించిందని, ప్రజల నమ్మకాన్ని సంపాదించిందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తాము ఓడిపోతామని అంచనా వేసినా, చివరికి ప్రజా తీర్పు తమకు అనుకూలంగా మారిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరికి అనుకూలమవుతాయో తేలాల్సి ఉంది. గత అనుభవాలను పరిశీలిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా నిజమవుతాయనే గ్యారంటీ లేదు. కానీ ఈసారి బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఢిల్లీలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. బీజేపీ విజయం సాధిస్తే ఢిల్లీలో మోదీ ప్రభావం మరోసారి స్పష్టమవుతుందని చెప్పొచ్చు. అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కేజ్రీవాల్ నాయకత్వంపై ప్రజలు ఇంకా నమ్మకమే ఉంచారని అర్థం. ఏదేమైనా అసలైన తీర్పు కోసం ఫిబ్రవరి 7న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.