Ganja In AP : నర్సీపట్నంలో భారీగా గంజాయి స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నంలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఆరుగురిని
- By Prasad Published Date - 07:32 PM, Sun - 9 July 23

ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నంలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఆరుగురిని నర్సీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 21 కిలోల ఎండు గంజాయి, మూడు ద్విచక్ర వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం నర్సీపట్నం హనుమాన్ దేవాలయం సమీపంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ శ్రీను, వి జనార్దన్, టి సత్యనారాయణ, పి జోగీంద్రరావు, ఎం సురేష్ బాబు, ఎం వీరబాబుగా నిందితులను పోలీసులు గుర్తించారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా నాలుగు శాశ్వత చెక్పోస్టులు, 11 డైనమిక్ చెక్పోస్టులను ఏర్పాటు చేశామని ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ బీ విజయ్భాస్కర్, అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు.