By-Election Results: ఉప ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి..?
ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాలు (By-Election Results) పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పులు ఏమీ చూపించలేదు.
- By Hashtag U Published Date - 11:11 AM, Sat - 9 September 23
By: డా. ప్రసాదమూర్తి
By-Election Results: ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాలు (By-Election Results) పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పులు ఏమీ చూపించలేదు. మూడు స్థానాలను బిజెపి, నాలుగు స్థానాలను ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA) పార్టీలు గెలుచుకున్నాయి. బిజెపి పశ్చిమ బెంగాల్లో ఒక స్థానాన్ని కోల్పోయి, త్రిపురలో ఒక స్థానాన్ని గెలుచుకుంది. గతంలో పశ్చిమబెంగాల్లో విజయం సాధించిన దుప్ గూరి అసెంబ్లీ స్థానంలో బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ చేతుల్లో ఓటమిపాలైంది ఈసారి. కానీ త్రిపురలో సిపిఐఎం చేతి నుంచి బోక్సానగర్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంది. అయితే ఈ ఉప ఎన్నికలలో ఒక కీలకమైన అంశం స్పష్టంగా కనిపిస్తున్నది. అదేమిటంటే ప్రతిపక్షాల ఇండియా కూటమి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో బలాబలాలు ఎలా ఉంటాయి, అధికార బిజెపి పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రతిపక్షాల బలం పెరుగుతుందా, అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఇరువర్గాల బలాబలాలను తారుమారు చేసే అవకాశం ఉందా అనే అంశాలు ఈ ఉప ఎన్నికల పట్ల కొంచెం ఆసక్తికరంగా మారాయి.
వాస్తవంగా ఫలితాలను చూసినప్పుడు పెద్ద మార్పు ఏమీ లేనట్టే కనిపిస్తుంది. కానీ ఒక కీలకమైన పరిణామం ప్రతిపక్ష ఇండియా కూటమికి అనుకూలంగా పరిశీలకులకు పలు ఊహాగానాలు చేసేందుకు వీలుగా కనిపిస్తుంది. అదే ఉత్తరప్రదేశ్ లోని ఘోసి అసెంబ్లీ స్థానం. ఈ స్థానం నిజానికి ఇంతకుముందు సమాజ్ వాది పార్టీ గెలుచుకున్నదే. అయితే ఎస్పీ టికెట్ మీద అసెంబ్లీలో గెలుపు సాధించిన తర్వాత ఎమ్మెల్యే దారాసింగ్ చౌహన్ పార్టీ మారి బిజెపితో చేతులు కలిపారు. అందుకే ఆ సీటు ఖాళీ అయి ఇప్పుడు దానికి ఉపఎన్నిక జరిగింది.
మొత్తం ఆరు రాష్ట్రాలు ఏడు స్థానాల ఉప ఎన్నిక ఒక ఎత్తు అయితే ఈ స్థానానికి ఇప్పుడు జరిగిన ఉప ఎన్నిక మరొక ఎత్తు. పరిశీలకుల కన్నంతా ఈ సీటు మీదే ఉంది. తాను ఖాళీ చేసిన స్థానం నుంచి ఈసారి దారాసింగ్ చౌహన్ బిజెపి టిక్కెట్ మీదుగా పోటీ చేశాడు. సమాజ్ వాది పార్టీ ఈ సీటుని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించింది. తమ పార్టీ తరపున సుధాకర్ సింగ్ ని నిలబెట్టింది. ఏం జరుగుతుందా అని ఈ స్థానం పట్ల దేశమంతా అందుకే ఉత్కంఠగా ఎదురు చూసింది. ఫలితాలు సమాజ్ వాది పార్టీకి అనుకూలంగా, బిజెపికి వ్యతిరేకంగా వచ్చాయి. బిజెపి అభ్యర్థి దారాసింగ్ చౌహాన్ పై 42 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో సమాజ్ వాది పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ గెలుపొందారు. సహజంగానే ఇండియా కూటమికి ఈ గెలుపు గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఇది ప్రజావ్యతిరేక మత రాజకీయాలపై ప్రజానుకూల రాజకీయాల గెలుపు అని, ఇది భారత్ ఇండియా కూటమి విజయం దిశగా నడుస్తున్నది అని చెప్పడానికి సూచన అని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.
Also Read: G20: జీ20 గ్రూప్లో పాకిస్తాన్ను ఎందుకు చేర్చలేదు.. కారణమిదేనా..?
ఈ ఉప ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇండియా కూటమిలో భాగమైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కేరళలోనూ బెంగాల్లోనూ పరస్పరం ఎన్నికల్లో తలపడ్డాయి. బిజెపి వర్గాలు, ప్రతిపక్షాల మధ్య ఇది ఎలాంటి ఐక్యతకు సంకేతమో.. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అని విమర్శలు గుప్పించిన విషయం గుర్తు తెచ్చుకోవాలి. కేరళలో సిపిఎం అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మధ్య పోటీ జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాందీ ఓమెన్ గెలుపొందారు. అలాగే బెంగాల్లో కాంగ్రెస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థికి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మధ్య పోటీ జరిగింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.
ఆ రాష్ట్రాల్లో ఈ పార్టీల మధ్య చాలా కాలంగా రాజకీయ పరమైన పోటీ ఉన్నది. అది ఇప్పుడూ కొనసాగింది. ఈ ఉపఎన్నిక పోటీ దేశవ్యాప్త ఎన్నికలలో ప్రతిపక్ష కూటమి ఐక్యతకు ఎలాంటి ఆటంకం కలిగించదని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. కానీ ఒకచోట కొట్టుకుంటూ మరోచోట ఎలా కలుస్తారని అధికార బిజెపి ఎద్దేవా చేస్తోంది. మొత్తానికి ఈ ఉప ఎన్నికల్లో అన్నిచోట్లా అందరూ గతంలోని బలాబలాలను అలాగే నిలబెట్టుకున్నారు. కానీ ఎవరు గెలిచినా యూపీ కేరళ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో గెలుపు మార్జిన్ మాత్రం చాలా స్వల్పంగా ఉంది. మొత్తానికి యూపీలో ఎన్నిక మాత్రం బిజెపి నైతిక ఓటమికి ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Related News
Rahul Gandhi Marriage: ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పెళ్లి…?
ఓ చిన్నారి రాహుల్ గాంధీని పెళ్లి గురించి ప్రశ్న వేసింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ చెప్పిన సమాధానం చూస్తుంటే రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత పెళ్లి చేసుకోవచ్చని తెలుస్తుంది.