దేశంలో మరోసారి ఎలక్షన్స్.. 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే!
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
- Author : Gopichand
Date : 15-03-2026 - 4:56 IST
Published By : Hashtagu Telugu Desk
Election Dates: ఎన్నికల సంఘం ఆదివారం నాడు దేశంలోని ఐదు రాష్ట్రాలైన అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో ఏప్రిల్ 23 ఏప్రి,ల్ 29 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. అసోంలో ఒకే దశలో ఏప్రిల్ 9న ఓటింగ్ జరుగుతుంది. తమిళనాడులో కూడా ఒకే దశలో ఏప్రిల్ 23న ఓటింగ్ నిర్వహిస్తారు. కేరళలో కూడా ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అలాగే పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్ 9నే ఒకే దశలో ఓటింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. గతంలో అక్కడ 8 దశల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
Also Read: మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!
ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు?
ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో పశ్చిమ బెంగాల్లో 294, తమిళనాడులో 234, కేరళలో 126, అసోంలో 126, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 సీట్లు ఉన్నాయి. దేశ జనాభాలో దాదాపు 20% మంది ఈ ఐదు రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. లోక్సభ, రాజ్యసభ స్థానాల పరంగా కూడా ఈ రాష్ట్రాలు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఇక్కడి నుండి 116 మంది లోకసభ ఎంపీలు, 51 మంది రాజ్యసభ ఎంపీలు ఎన్నికై పార్లమెంటుకు చేరుకుంటారు. అంటే ఈ రాష్ట్రాల ఎన్నికలు కేవలం ప్రాంతీయ రాజకీయాలనే కాకుండా దేశం స్థితిగతులను, దిశానిర్దేశాన్ని కూడా నిర్ణయించబోతున్నాయి.
మమతా కోటపై కన్నేసిన బీజేపీ
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బెంగాల్లో ప్రస్తుతం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) ప్రభుత్వం ఉంది. మమతా బెనర్జీ గత 15 ఏళ్లుగా అక్కడ అధికారంలో కొనసాగుతున్నారు. 2026లో ఆమె నాలుగోసారి విజయం సాధిస్తే వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారు. 2021 ఎన్నికల్లో టీఎంసీ 213 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది. బీజేపీ కేవలం 77 సీట్లు మాత్రమే గెలవగలిగింది. మరోవైపు లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలకు కూడా ఈ గడ్డపై తమ ఉనికిని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది.