Varun Gandhi : వరుణ్ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్.. పార్టీలో చేరే ఛాన్స్ ?
Varun Gandhi : ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ లోక్సభ టికెట్ను వరుణ్ గాంధీకి ఇచ్చేందుకు బీజేపీ నో చెప్పింది.
- Author : Pasha
Date : 26-03-2024 - 2:51 IST
Published By : Hashtagu Telugu Desk
Varun Gandhi : ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ లోక్సభ టికెట్ను వరుణ్ గాంధీకి ఇచ్చేందుకు బీజేపీ నో చెప్పింది. ఈసారి జితిన్ ప్రసాదకు పిలిభిత్ టికెట్ను కేటాయించింది. దీంతో వరుణ్ గాంధీ రాజకీయ భవితవ్యం డైలమాలో పడింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఎదుటకు రెండు ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ టికెట్ మాట్లాడుతూ.. వరుణ్ గాంధీకి టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పిలిభిత్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే గడువు రేపటితో ముగియనుంది. ఈతరుణంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కీలక ప్రకటన చేశారు. ‘‘వరుణ్ గాంధీ కాంగ్రెస్లో చేరితే మేం సంతోషిస్తాం. వరుణ్ విద్యావంతుడు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కేవలం గాంధీ కుటుంబానికి సంబంధం ఉందన్న కారణంతోనే బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయనను మేం సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. దీంతో ఇవాళ రాత్రికల్లా వరుణ్ గాంధీ కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
గత కొంతకాలంగా బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్రంలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై వరుణ్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. అమేథీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రి లైసెన్సును సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు రద్దు చేసినప్పటి నుంచి ఈ వ్యవహారం ముదురుతోంది. తమ ఆస్పత్రి పేరులో ‘గాంధీ’ అనే పదం ఉండబట్టే .. యోగి సర్కారు లైసెన్సును రద్దు చేసిందని అప్పట్లో వరుణ్ గాంధీ మండిపడ్డారు. ఈ పరిణామం చోటుచేసుకున్న కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేదార్నాథ్లో వరుణ్ గాంధీ(Varun Gandhi) కలుసుకున్నారు. కాగా.. వరుణ్ తల్లి మేనకా గాంధీకి మాత్రం లోక్సభ టికెట్ కేటాయించింది. యూపీలోని సుల్తాన్పుర్ నుంచి ఆమెను బరిలోకి దింపింది.
Also Read : 733 Jobs : రైల్వేలో 733 జాబ్స్.. ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ సహా ఎన్నో పోస్టులు
జితిన్ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ ఇదీ..
ప్రస్తుతం బీజేపీ తరఫున పిలిభిత్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జితిన్ ప్రసాద్ ఒకప్పుడు కాంగ్రెస్లోనే ఉండేవారు. 2004 లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున షాజహాన్పూర్ లోక్సభ స్థానం నుంచి గెలిచారు. 2009 ఎన్నికల్లో ధౌరహర స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ, పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రిగా జితిన్ వ్యవహరించారు. రెండు సంవత్సరాల క్రితమే జితిన్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.