Delimitation Bill: నేడే లోక్సభలో అసలైన పరీక్ష.. మూడు కీలక బిల్లులు..!
- Author : Vamsi Chowdary Korata
Date : 16-04-2026 - 10:57 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడం ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో వాడివేడి చర్చకు రంగం సిద్ధమైంది.
నేటి నుంచి ప్రారంభమైన మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లును సభ ముందు ఉంచుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెడతారు. 2029 సాధారణ ఎన్నికల నాటికి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను అమలు చేయాలంటే, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా లోక్సభ స్థానాలను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచాలని కూడా ప్రతిపాదించింది.
మరోవైపు, ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే, డీలిమిటేషన్ బిల్లును, రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే, జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. “మహిళా రిజర్వేషన్ బిల్లును మేం సమర్థిస్తున్నాం. కానీ ప్రభుత్వం డీలిమిటేషన్తో గిమ్మిక్కులు చేస్తోంది. ఇది రాజకీయ ప్రేరేపితం” అని అన్నారు.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు (సుమారు 360 ఓట్లు) తప్పనిసరి. అధికార ఎన్డీయే కూటమికి 292 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో విపక్షాల మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో 18 గంటల పాటు జరగనున్న ఈ చర్చ దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.