Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు
కమల్తో పాటు డీఎంకే పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇక, MNM పార్టీ భారత విపక్ష కూటమి INDIAలో భాగంగా కొనసాగుతోంది.
- By Latha Suma Published Date - 01:32 PM, Fri - 6 June 25

Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభకు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. చెన్నైలోని అసెంబ్లీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఇది MNM పార్టీకి రాజకీయంగా కీలకమైన ముందడుగుగా అభివర్ణించవచ్చు. కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ వేయడం రాజకీయ పరంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆయన స్థాపించిన MNM పార్టీ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కూటమి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం MNM పార్టీకి రాజ్యసభ స్థానం కేటాయించడానికి డీఎంకే అంగీకరించింది. 2018లో MNMను కమల్ ప్రారంభించినప్పటి నుంచి ఇది వారి పార్టీకి తొలిసారిగా కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశంగా నిలిచింది.
Read Also: Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఇటీవల జరిగిన ‘థగ్ లైఫ్’ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో కమల్ “తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది” అనే వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం రేగింది. కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మరియు ప్రేక్షకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనితో పాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కమల్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, క్షమాపణ చెప్పినట్లయితే సమస్యలు పరిష్కారమవుతాయంటూ సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కమల్ హాసన్ బుధవారం వేయాల్సిన రాజ్యసభ నామినేషన్ను వాయిదా వేసుకున్నారు. తాను సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నుంచి గట్టి అవగాహనతో బయటపడి, అన్ని వివాదాలు పరిష్కారమైన తర్వాతే నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
థగ్ లైఫ్ చిత్రం గురువారం విడుదలవడంతో నేడు నామినేషన్ దాఖలు చేశారు. కమల్తో పాటు డీఎంకే పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇక, MNM పార్టీ భారత విపక్ష కూటమి INDIAలో భాగంగా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో MNM, డీఎంకే, కాంగ్రెస్ కూటమిని సమర్థించింది. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాల్లో, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో MNM ప్రచారం నిర్వహించింది. ఇది MNM, డీఎంకే మధ్య ఉన్న రాజకీయ బంధానికి ప్రతీకగా నిలిచింది. ఈ నేపథ్యంలో కమల్ రాజ్యసభ ప్రవేశం పార్టీ భవిష్యత్కు దిశానిర్దేశకంగా మారనుంది. అయితే భాషా వివాదాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా కమల్పై ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Madhya Pradesh : మధ్యప్రదేశ్లో 230 కోట్ల కుంభకోణం.. 50వేల బోగస్ ఉద్యోగులతో ప్రభుత్వ యంత్రాంగం సంచలనం!