భారత్లో ఒకే వేదికపై కలవనున్న ఇరాన్, సౌదీ అరేబియా!
భారత్ ఈ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించనుంది. మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది.
- Author : Gopichand
Date : 02-04-2026 - 5:28 IST
Published By : Hashtagu Telugu Desk
BRICS: మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) యుద్ధంలో ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శత్రువుల్లా పోరాడుకుంటున్నాయి. కానీ ఈ మూడు దేశాలు స్నేహితులు కూడా అని చెప్పడానికి వచ్చే నెలలో భారత్లో జరగబోయే ఘటనే నిదర్శనం. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా సౌదీ అరేబియా, UAEలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసి విధ్వంసం సృష్టించింది. ఈ కారణంగా రెండు దేశాలు ఇరాన్కు వ్యతిరేకులుగా మారాయి. తాజాగా UAE అయితే ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమవుతూ అమెరికాకు మద్దతు ప్రకటించింది.
బ్రిక్స్ సభ్య దేశాలుగా ఇరాన్, UAE, సౌదీ
యుద్ధభూమిలో ఒకరికొకరు ఎదురుపడినా ఈ మూడు దేశాలు ఒకే టేబుల్ వద్ద కూర్చుని స్నేహితుల్లా చర్చించుకోబోతున్నాయి. ప్రస్తుతం ఈ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ వాస్తవానికి ఇవన్నీ ఒకే అంతర్జాతీయ సంస్థలో సభ్య దేశాలు. ఆ సంస్థ సమావేశం వచ్చే నెలలో భారత్లో జరగనుంది. మే 14-15 తేదీల్లో భారత్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇందులో ఇరాన్, సౌదీ అరేబియా, UAE కూడా సభ్యులుగా ఉన్నాయి.
Also Read: Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
మే 14, 15 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సమిట్ 2026
భారత్ ఈ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించనుంది. మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. భారత్ ఇప్పటికే రష్యా, ఇరాన్, UAE, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలకు ఆహ్వానాలు పంపింది. బ్రిక్స్ గ్రూపులో వ్యవస్థాపక సభ్యులుగా బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. కాగా 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE, 2025లో ఇండోనేషియా ఈ గ్రూపులో చేరాయి.
యుద్ధాన్ని వ్యతిరేకించాలని బ్రిక్స్కు ఇరాన్ విజ్ఞప్తి
బ్రిక్స్ సభ్య దేశాల మొత్తం జనాభా సుమారు 3.9 బిలియన్లు. ఇది ప్రపంచ జనాభాలో 48 శాతానికి సమానం. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే ధృవీకరించారు. మార్చి 14న ఇరాన్ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన భారత్.. మిడిల్ ఈస్ట్ యుద్ధంపై బ్రిక్స్ దేశాల నుంచి సంయుక్త ప్రకటన రావడం కష్టమని పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. బ్రిక్స్లోని కొన్ని దేశాలు స్వయంగా యుద్ధంలో భాగంగా ఉన్నందున యుద్ధానికి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రకటన చేయడం సాధ్యం కాకపోవచ్చని తెలిపారు.