భారత్లో గూగుల్ భారీ క్యాంపస్… 20,000 మందికి ఉద్యోగాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 04-02-2026 - 3:20 IST
Published By : Hashtagu Telugu Desk
Google భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం.
హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి కంపెనీలు విదేశీయులను నియమించుకోవడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో హెచ్-1బీ వీసాల జారీకి తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలకు చెక్ పెట్టేలా దిగ్గజ సంస్థ గూగుల్ కీలక చర్యలు చేపట్టింది. వీసాలు, ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూడకుండా భారత్లో తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. ఇందులో భాగంగా భారత్లో భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తోందట. బెంగళూరులో ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు బ్లూమ్ బర్గ్ ఓ కథనం ప్రచురించింది.
బెంగళూరులోని వైట్ఫీల్డ్ టెక్ కారిడారులో 20 వేల మంది ఉద్యోగుల కోసం గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ సిద్ధం చేస్తోందని బ్లూమ్ బర్గ్ కథనం పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే ఓ ఆఫీసు టవర్ను లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు మరో రెండు టవర్లను లీజుకు తీసుకునేందుకు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ చర్చలు చేపడుతోందని పేర్కొంది. ఈ మూడు టవర్లు మొత్తం 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటాయని, 20 వేల మంది ఉద్యోగులు పని చేసేలా ఈ క్యాంపస్ ఏర్పాటు చేస్తోందని తెలిపింది.
తొలి టవర్లో మరికొన్ని నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తోందని బ్లూమ్బర్గ్ తెలిపింది. మిగితా రెండు టవర్లు వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మొదటి టవర్ లీజును ఇప్పటికే ఆల్ఫాబెట్ కంపెనీ సైతం అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం గూగుల్ కంపెనీలో భారత్లో 14 వేల మంది పని చేస్తున్నారు. వైట్ ఫీల్డ్ క్యాంపస్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయితే అమెరికా వెలుపల గూగుల్కు భారత్ ప్రధాన కేంద్రంగా మారనుంది.
ప్రస్తుతం టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై దృష్టి సారించాయి. ఇలాంటి తరుణంలో మార్కెట్ సృష్టి, అధునాత ఇంజినీరింగ్ కార్యకలాపాలకు భారత్ కేంద్ర బిందువుగా అవతరిస్తోంది. దిగ్గజ కంపెనీలు భారత్పై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ భారత్లో తమ వ్యాపార కార్యకలాపాలను మొదలు పెట్టింది. ఇప్పుడు గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఆ దిశఘా దృష్టి సారించాయి. మరోవైపు హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం నిబంధనలు కంపెనీల విస్తరణకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు కట్టాలని అమెరికా సర్కార్ కొత్త రూల్స్ తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలు తమ దీర్ఘకాలిక నియామక ప్లాన్స్ మార్చుకుంటున్నాయి. అమెరికాకు భారత ఉద్యోగులను తీసుకోవడం కంటే ఇండియాలోనే కార్యకలాపాలను సాగించడం ఉత్తమమని పలు కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో వీసా ఆలస్యాలు, ఖర్చులు తప్పించుకోవచ్చు అనేది టెక్ కంపెనీలు ఆలోచిస్తున్నట్లు గూగుల్ ప్లాన్ ద్వారా తెలుస్తోంది.