H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్-1బీ వీసా ఫీజు పెంపు
- Author : Vamsi Chowdary Korata
Date : 09-06-2026 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న భారతీయ టెక్ నిపుణులతో పాటు ఇతర విదేశీ నిపుణులకు భారీ ఊరట లభించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల (సుమారు రూ. 95.8 లక్షలు) భారీ ఫీజును అమెరికా ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. ఈ ఫీజు పెంపు చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్తుందని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఇలాంటి పన్ను విధించలేరని బోస్టన్లోని ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. ‘రాయిటర్స్’ వార్తాసంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో ప్రకటించిన ఈ ఫీజును సవాలు చేస్తూ డెమొక్రాటిక్ పార్టీకి చెందిన 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టులో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరోకిన్ కీలక తీర్పు ఇచ్చారు. “చట్టం ద్వారా కాంగ్రెస్ అధికారం ఇస్తే తప్ప, పన్ను విధించే అధికారం అధ్యక్షుడికి లేదు. హెచ్-1బీ పిటిషన్లపై విధించిన ఈ ఫీజు కాంగ్రెస్ అనుమతి లేని పన్ను అని కోర్టు నిర్ధారించింది. అందువల్ల ఈ విధానాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటిస్తూ, పూర్తిగా రద్దు చేస్తున్నాం” అని తీర్పులో వెల్లడించారు.
భారీగా తగ్గిన దరఖాస్తులు
ఈ ఫీజు పెంపు వల్ల హెచ్-1బీ వీసా దరఖాస్తులు భారీగా పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో 3,43,981గా ఉన్న హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు, 2027 ఆర్థిక సంవత్సరానికి 2,11,600కి పడిపోయాయి. అంటే దాదాపు 38.5 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నాటికి కేవలం 85 మంది మాత్రమే లక్ష డాలర్ల ఫీజు చెల్లించినట్లు ప్రభుత్వం మార్చిలో కోర్టుకు తెలిపింది. సాధారణంగా హెచ్-1బీ వీసా కోసం కంపెనీలు 2,000 నుంచి 5,000 డాలర్ల వరకు ఫీజు చెల్లిస్తాయి.
అమెరికన్ ఉద్యోగుల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి హెచ్-1బీ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విధానం వల్ల దేశ ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (STEM) రంగాల్లో వేతనాలను కృత్రిమంగా తగ్గించడానికి కంపెనీలు ఈ వీసాలను వాడుకుంటున్నాయని ఆక్షేపించింది.
భారతీయులపై తీవ్ర ప్రభావం
ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా టెక్ రంగంలో ఇప్పటికే ఉద్యోగాల కోతలు పెరగడంతో కంపెనీలు అధిక ఫీజులు చెల్లించి విదేశీయులను నియమించుకోవడానికి వెనుకడుగు వేశాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది భారతీయ నిపుణులు, నిబంధనల ప్రకారం 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించలేక స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, అయితే ఇది కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకున్నది కాదని రూబియో వివరించారు. దేశంలో వలసల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.