Bharathiraja: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు
- Author : Vamsi Chowdary Korata
Date : 10-06-2026 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారతీరాజాకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలకాలంటూ తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్ఏపీఏ) చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
అంతకుముందు టీఎఫ్ఏపీఏ ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేస్తూ, తమ వ్యవస్థాపకుడైన భారతీరాజాకు ప్రభుత్వ గౌరవం కల్పించాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం విజయ్, ప్రభుత్వ గౌరవ వందనంతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం పట్ల నిర్మాతల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా టీఎఫ్ఏపీఏ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. భారతీయ చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు భారతీరాజా అని కొనియాడింది. ఒక దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించడమే కాకుండా, నటుడిగానూ తనదైన ముద్ర వేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ (2004) పురస్కారంతో పాటు 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అందుకొని సినిమాకు గర్వకారణంగా నిలిచారని గుర్తుచేసింది.
2020లో నిర్మాతల సంక్షేమం కోసం భారతీరాజా ముందుండి ‘తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ను స్థాపించారని, ఆయన నాయకత్వ పటిమతోనే ఈ సంఘం నేడు 400 మందికి పైగా క్రియాశీల నిర్మాతలతో బలంగా ఉందని అసోసియేషన్ తెలిపింది. నిర్మాతలు, దర్శకులు, నటీనటుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం తపించారని, తమిళ సినిమా అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారని కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంది.
నివాళులర్పించిన సీఎం విజయ్
అంతకుముందు భారతీరాజాకు సీఎం విజయ్ ఘన నివాళులర్పించారు. చెన్నైలోని దర్శకుడి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన గాఢ సానుభూతిని తెలియజేశారు.