Betting App Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు శ్యామల
Betting App Case : ఇప్పటికే సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు
- By Sudheer Published Date - 01:12 PM, Mon - 24 March 25

హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్(Betting App )లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్న ఆన్లైన్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. గత వారం బుల్లితెర తారలు విష్ణుప్రియ, రీతూ చౌదరిని గంటల కొద్దీ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ యాంకర్, సినీ నటి, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల (Shyamala) పేరు కూడా ఈ వివాదంలో నిలిచింది.
Tiger And Trump: డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలితో టైగర్ ప్రేమాయణం
ఆంధ్రా365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్కు శ్యామల ప్రమోషన్ చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను విచారణకు రావాల్సిందిగా గత శుక్రవారం నోటీసులు జారీ చేశారు. దీంతో శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు హాజరై విచారణలో పాల్గొన్నారు. ఈ కేసులో శ్యామల ప్రమేయంపై పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం ద్వారా యువతను మోసపుచ్చేలా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి.
Box Office : సినీ లవర్స్ కు ఈ వారం పండగే పండగ
తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ శ్యామల హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు సహకరించాల్సిందిగా శ్యామలకి సూచించింది. కోర్టు ఆదేశాలతోనే ఆమె పోలీసుల ఎదుట హాజరై విచారణలో పాల్గొన్నారు. ఈ కేసు ఎలా మలుపుతిరుగుతుందో, మరెవరెవరు ఈ బెట్టింగ్ యాప్ కేసులో పోలీసుల విచారణకు హాజరవుతారో చూడాల్సి ఉంది.