లఖ్పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!
పాఠశాల విద్య సమయంలో సదరు బాలిక ఢిల్లీ ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదవడం తప్పనిసరి.
- Author : Gopichand
Date : 17-02-2026 - 2:54 IST
Published By : Hashtagu Telugu Desk
Lakhpati Bitiya Yojana: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కుమార్తెల విద్య, వారి ఆర్థిక సాధికారత కోసం లఖ్పతి బిటియా యోజన 2026ను ప్రకటించారు. డబ్బు లేకపోవడం వల్ల ఏ అమ్మాయి కూడా గ్రాడ్యుయేషన్కు ముందే చదువు ఆపేయకూడదనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం కింద ఢిల్లీ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఆమె డిగ్రీ పూర్తయ్యే వరకు వివిధ దశల్లో మొత్తం 56,000 రూపాయలను పెట్టుబడి పెడుతుంది. ఈ డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. వడ్డీ కలిసిన తర్వాత సదరు అమ్మాయికి 21 ఏళ్లు నిండినప్పుడు 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది.
ఎవరు అర్హులు?
ఢిల్లీలో జన్మించిన ప్రతి అమ్మాయికి ఈ పథకం వర్తించదు. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి.
ఢిల్లీ నివాసి: దరఖాస్తు చేసే కుటుంబం గత 3 ఏళ్లుగా ఢిల్లీలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం 1.20 లక్షల రూపాయల కంటే తక్కువ ఉండాలి (గతంలో ఈ పరిమితి 1 లక్ష రూపాయలుగా ఉండేది).
జనన స్థలం: పాప తప్పనిసరిగా ఢిల్లీలోనే జన్మించి ఉండాలి (బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి).
ఇద్దరు కుమార్తెల పరిమితి: ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందగలరు.
ప్రభుత్వ పాఠశాల: పాఠశాల విద్య సమయంలో సదరు బాలిక ఢిల్లీ ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదవడం తప్పనిసరి.
Also Read: Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?
నగదు ఎప్పుడెప్పుడు అందుతుంది?
ప్రభుత్వం ఈ మొత్తాన్ని నేరుగా ఆధార్తో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాలో విడతలవారీగా జమ చేస్తుంది.
జననం సమయంలో: రూ. 11,000 (ఆసుపత్రిలో పుడితే) లేదా రూ. 10,000 (ఇంట్లో పుడితే).
- 1వ తరగతిలో చేరినప్పుడు: రూ. 5,000.
- 6వ తరగతిలో చేరినప్పుడు: రూ. 5,000.
- 9వ తరగతిలో చేరినప్పుడు: రూ. 5,000.
- 10వ తరగతి ఉత్తీర్ణతపై: రూ. 5,000.
- 12వ తరగతిలో చేరినప్పుడు: రూ. 5,000.
- గ్రాడ్యుయేషన్/డిప్లొమా: రూ. 20,000 (వివిధ దశల్లో).
మెచ్యూరిటీ: అమ్మాయికి 21 ఏళ్లు నిండి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు వడ్డీతో కలిపి మొత్తం 1 లక్ష కంటే ఎక్కువ నగదు లభిస్తుంది.
అవసరమైన పత్రాలు
- దరఖాస్తు కోసం ఈ క్రింది పత్రాలు అవసరం
- కుమార్తె పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
- తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్
- ఆదాయ ధృవీకరణ పత్రం
- ఢిల్లీలో 3 ఏళ్లుగా నివసిస్తున్నట్లు నివాస ధృవీకరణ
- కుమార్తె పాస్పోర్ట్ సైజ్ ఫోటో
దరఖాస్తు చేయడం ఎలా?
ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసింది. 1 ఏప్రిల్ 2026 నుండి మీరు ఢిల్లీ ప్రభుత్వ అధికారిక పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.